Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో 19న పోలింగ్
న్యూఢిల్లీ : ఈ నెల 19న జరుగనున్న ఏడవ, చివరి విడత ఎన్నికలకు ప్రచారం ఊపందుకుంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాల్లో చివరి విడతలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో 13 స్థానాలు, పంజాబ్లోని మొత్తం 13 స్థానాలు, పశ్చిమబెంగాల్ 9, బీహార్, మధ్యప్రదేశ్ 8, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్లో 3, చండీగఢ్లో ఒక నియోజకవర్గంలో ఏడో విడతలో పోలింగ్ జరుగుతున్నది. వివిధ పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు తమ తమ అభ్యర్థుల గెలుపుకోసం ఆయా రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మధ్యప్రదేశ్లోని రాట్లంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గిరిజన ప్రయోజనాల కోసం వాజ్పేయి ప్రారంభించగా, ఆయన అడుగుజాడల్లో తమ ప్రభుత్వం పనిచేస్తూ, వారి అభివృద్ధికి కృషిచేస్తున్నదని మోడీ చెప్పారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్లోని సోలన్లో మోడీ ప్రచారంలో పాల్గొన్నారు. పంజాబ్లో కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ పలు బహిరంగసభల్లో ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మధ్యప్రదేశ్లోని రాట్లం, ఇండోర్లో రోడ్షోలో పాల్గొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో భారీ బహిరంగసభలో ప్రసంగించారు. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆమె ఆరోపించారు.
ప్రచారం ఘనం.. అమలు శూన్యం
మోడీపై ప్రియాంక విమర్శ
రత్లం(మధ్యప్రదేశ్) : ప్రధాని మోడీపై కాంగ్రెస్ నాయకురాలు సోమవారం ఎన్నికల ప్రచారంలో విమర్శలు ఎక్కుపెట్టారు. గత ఐదేళ్ల ఎన్డీయే పాలనలో బీజేపీ ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశాభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నానని మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ కష్టం చేస్తే మనిషికి ఉన్న అహంకారం తగ్గుతుందని, కానీ అది మోడీకి మరింతగా పెరిగిందని అన్నారు. మధ్యప్రదేశ్లోని రాత్లం పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. గత ఏదేళ్లలో కాలంలో మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ఐదు నిమిషాలు కూడా కేటాయించలేకపోయారని మండిపడ్డారు.
హీటెక్కిన జాతీయ రాజకీయాలు
జోరందుకున్న పొత్తులు
23న ఫలితాలపై పార్టీల్లో ఉత్కంఠ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల పక్రియ ముగింపు దశకు చేరుకున్న దశలో పొత్తులకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్తంగా చర్చలు జోరందుకున్నాయి. 17వ లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలు, విమర్శనాస్త్రాలతో దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతలపై అవాకులు చవాకులు పేలుస్తుండగా, రాహుల్గాంధీ దూరంగా ఉన్న మిత్రులను కూటమివైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంటడంతో రాహుల్గాంధీ పొత్తులకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలతో పాటు ఆ పార్టీపై ఒంటి కాలిపై లేచే నేతలను కూడా ఆయన మచ్చిక చేసుకునేందుకు యత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల రాహుల్గాంధీ ఒక ప్రయివేట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాయావతిపై పొగడ్తల వర్షం కురిపించారు. మాయావతి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్తో ఎటువంటి పొత్తు ఉండదని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే ఆమెను పొగుడుతూ రాహుల్ మాట్లాడారని సీనియర్ జర్నలిస్టులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇదిలావుండగా రాష్ట్రాల స్థాయిల్లో ఎన్ని రాజకీయ వైరుద్ధ్యాలున్నా జాతీయ స్థాయిలో మాత్రం అందరూ కలిసి పని చేయాలని ఆయా విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఎన్నికల తర్వాతే లౌకిక ప్రభుత్వ ఏర్పాటుపై ప్రజలకు భరోసా ఇవ్వడంతోపాటు, భవిష్యత్తు విధానాలను ప్రకటించేందుకు ప్రతిపక్ష పార్టీలు సమాలోచనలు జరుపుతున్నాయి. ముందుగా ఈ 21వ తేదీన సమావేశం నిర్వహిద్దామని భావించినా... ఎన్డీయే పక్షాలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని రద్దు చేసుకున్నట్టు ఏఐసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తాము ప్రత్యేక సమావేశం ఏదీ నిర్వహించాలని తలపెట్టలేదని, మిత్రపక్ష పార్టీలకు చెందిన నేతలు సూచిస్తే పరిశీలిద్దామని వ్యాఖ్యానించినట్టు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు నవ తెలంగాణకు చెప్పారు. ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై మోడీ, అమిత్షా, ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడులను అడ్డుకోవడమే తమ ముఖ్య లక్ష్యమని చెప్పారు. 21 న నిర్వహించాల్సిన సమావేశం 23 లేదా 24, 25వ తేదీల్లో జరపవచ్చన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున జరుగుతు న్నాయి. అయితే, దీనికి సంబంధించి వెంటనే ఒక అభిప్రాయానికి రావాలని ప్రతిపక్షాలకు చెందిన నేతలు యోచన చేస్తున్నారు.