Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరణ్ థాపర్ ప్రశ్నలకు
- తడబడ్డ కేంద్రమంత్రి నితిన్గడ్కరీ
- ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే పౌరుల్ని జాతి వ్యతిరేకులంటారా..? : నిలదీసిన సీనియర్ జర్నలిస్ట్
- ప్రభుత్వాన్నే కాదు, సైన్యాన్నయినా ప్రశ్నించే హక్కు పౌరులకుంది : థాపర్
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్నవేళ మోడీ ప్రభుత్వంలోని సీనియర్మంత్రి నితిన్గడ్కరీని ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ధాపర్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. మోడీ నేతృత్వంలో ఎన్డీఏ-2 ఈ ఐదేండ్ల కాలంలో కనబరచిన పనితీరు, 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యాలపై కరణ్ధాపర్ ప్రశ్నించారు. కాస్త ఘాటుగా, సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వడంలో గడ్కరీ తడబడ్డారు. మోడీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై తన అసంతృప్తిని అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నట్టు గడ్కరీపై మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తన పార్టీని రక్షించుకునేందుకు సంయమనంతో సమాధానాలిచ్చే ప్రయత్నం చేశారు..
న్యూఢిల్లీ: బాలాకోట్పై వైమానిక దాడి ద్వారా పాకిస్తాన్కు గట్టి సందేశమిచ్చినట్టు మీ ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కానీ, పాకిస్తాన్ దాన్ని తోసిపుచ్చింది. పైగా నరేంద్రమోడీ తిరిగి ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ అనడంపై గడ్కరీని స్పందన కోరగా...దేశ రక్షణకు సంబంధించిన సున్నిత అంశమంటూ సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. మూడు యుద్ధాల్లో ఓడిపోయిన పాకిస్తాన్, ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలకు మద్దతు ఇస్తూ పరోక్ష యుద్ధం చేస్తున్నదని గడ్కరీ అన్నారు.
బాలాకోట్లో ఏం జరిగిందో తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదా..? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే పౌరులపై జాతి వ్యతిరేకులు, దేశభక్తి లేనివారంటూ ముద్రలు వేయడం తగునా..? ఎఫ్-16ను కూల్చి వేశామని చెబుతున్నారు. అందులో నిజం ఎంత..? అంటూ థాపర్ ప్రశ్నించగా..ఇది మీరు ప్రభుత్వాన్ని కాదు, భద్రతాదళాల్నే అడుగుతున్నారం టూ గడ్కరీ గడసరితనం ప్రదర్శించారు. ఇలాంటి ప్రశ్నలు రక్షణ దళాల్ని అవమానించడమే అవుతుందని గడ్కరీ అన్నారు. ఈ సందర్భంగా మనది పాకిస్థాన్లా అర్థ మిలిటరీ రాజ్యం కాదని థాపర్ అన్నారు. ప్రజాస్వామిక దేశంలో సైనిక చర్యలనైనా ప్రశ్నించవచ్చునని థాపర్ అన్నారు. 1962లో చైనాతో యుద్ధం జరుగుతుండగా, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు యువ ఎంపీయైన వాజ్పేయి డిమాండ్ చేయగా, అందుకు అప్పటి ప్రధాని నెహ్రూ అంగీ కరించిన విషయాన్ని థాపర్ గుర్తు చేశారు. పాకిస్థాన్లో దాడి పట్ల అనుమానాలు వ్యక్తం చేయడాన్ని సైన్యాన్ని అవ మానించడమంటూ గడ్కరీ తన ప్రభుత్వం తీరును సమర్థిం చుకునే యత్నం చేశారు. ఇది ఎందుకు అవమానించడ మవుతుంది..? అంతర్జాతీయంగా కూడా దీనిపై అనుమా నాలు వ్యక్తమయ్యాయి కదా..? అంటూ థాపర్ తిరిగి ప్రశ్నించగా.. పాక్ మీడియాలోని కథనాల ఆధారంగా కొం దరు మాట్లాడుతున్నారంటూ గడ్కరీ బదులిచ్చారు. అనుమా నాలొచ్చినపుడు ప్రభుత్వాన్ని లేదా సైన్యాన్ని అయినాసరే ప్రశ్నించి వివరణ కోరే హక్కు పౌరులకు లేదా..? అంటూ థాపర్ పదేపదే ప్రశ్నించడంతో దీనిపై ఇంతకన్నా ఎక్కువగా ఏమీ చెప్పలేనంటూ గడ్కరీ దాటవేశారు.
కాశ్మీర్లో పెరిగిన హింసపై..
కాశ్మీర్ సమస్యపైనా థాపర్ ప్రశ్నించారు. మోడీ అధికారం చేపట్టిన తర్వాత(2014 నుంచి) కాశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు 300శాతం పెరిగాయి, బాంబు పేలుళు330 శాతం పెరిగాయి. హింస వల్ల ఒక దశాబ్దంలో మర ణించినవారి కంటే ఈ ఐదేండ్ల కాలంలోనే అధికమని థాపర్ గుర్తు చేశారు. కాశ్మీర్లో మోడీ హయాంలోనే పరిస్థితి విష మించింది కదా అన్న ప్రశ్నకు గడ్కరీ సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఈసారి ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికరణం 370, అధికరణం 35ఏను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దీని వల్ల పరిస్థితి మరింత జఠిలం కాదా..? అన్న ప్రశ్నకు గడ్కరీ సమాధానమిస్తూ..కాశ్మీర్ను అభివృద్ధి పరిచేందుకు ఐటీ పరిశ్రమలు, హౌటళ్లు, రిసార్ట్లూ అవసరమని గడ్కరీ అన్నారు. పర్యాటకాన్ని అభివృద్ధి పరచాలన్నారు. అధికరణం 370 వల్ల అక్కడ భూములు కొనుగోలు చేయడానికి బయటివారికి వీలు కాదని గడ్కరీ తెలిపారు. అక్కడ ఐటీ పరిశ్రమలు నెలకొల్పాలంటే ఈ చర్యలు తప్పవని ఆయన అన్నారు. 370 అధికరణాన్ని రద్దు చేయడం తమ పార్టీ సిద్ధాంతమని గడ్కరీ స్పష్టం చేశారు. తమకు గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఉన్నా అక్కడ నెలకొన్న సున్నిత పరిస్థితుల వల్ల దానిని రద్దు చేయలేకపోయామని ఆయన తెలిపారు.
రైతుల ఆత్మహత్యలపై..
మోడీ అధికారం చేపట్టిన తర్వాత మూడేండ్లలో రైతుల ఆత్మహత్యలు 42 శాతం పెరిగినట్టు ఎన్సీఆర్బీ నివేదికలు వెల్లడించాయి. ఆ తర్వాత ఆ నివేదికల్ని నిలిపివేశారు. మీ సొంత రాష్ట్రం మహారాష్ట్రలో గత ఐదేండ్లలో రైతుల ఆత్మహ త్యలు రెట్టింపయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడంలో మీ ప్రభుత్వం విఫలమైందని ఒప్పుకుంటారా..? అంటూ థాపర్ ప్రశ్నించారు. ఈ సమస్య బీజేపీ సృష్టించింది కాదని, 70 ఏండ్లుగా అనుసరించిన తప్పుడు ఆర్థిక విధానాలు, అవినీతి, సరైన దార్శనికత లేని కాంగ్రెస్ పార్టీ వల్లేనని గడ్కరీ సమాధానమిచ్చారు. అయితే, మహారాష్ట్రలో 2011 నుంచి 2014 వరకు రైతుల ఆత్మహత్యలు జరగగా, 2015 నుంచి 2018 వరకు బీజేపీ పాలనలో 11,995మంది ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని థాపర్ గుర్తు చేశారు.
పెరిగిన నిరుద్యోగంపై..
మోడీ హయాంలో పెరిగిన నిరుద్యోగం గురించీ థాపర్ ప్రశ్నించారు. ఎన్ఎస్ఎస్వో డేటా ప్రకారం 2017-18లో దేశంలో నిరుద్యోగం 6.1 శాతమని, ఇది 45 ఏండ్లలో అత్యధికమని థాపర్ గుర్తు చేశారు. 2014 ఎన్నికలకు ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా మని మోడీ ఇచ్చిన వాగ్దానం ఏమైందని థాపర్ ప్రశ్నిం చారు. ఉద్యోగాల కల్పనలో మీ హయాంలో మంచి రోజులు లేవని, చెడ్డరోజులని అందరూ భావిస్తున్నారంటూ థాపర్ ఘాటుగా ప్రశ్నించారు. దాంతో, సూటిగా సమాధా నం చెప్ప లేక మా ప్రభుత్వం పట్ల పూర్తిగా మీరు వ్యతిరేక ధోరణితో ఉన్నారంటూ గడ్కరీ ఒకింత అసహనానికి గురయ్యారు. ఈసారి బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడాన్ని థాపర్ గుర్తు చేశారు. అందుకు సూటిగా సమాధాన మివ్వని గడ్కరీ తమ ఆర్థిక విధానాలన్నీ ఉద్యోగాల కల్పన కోసమే అంటూ దాటవేశారు.