Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదో తరగతి సోషల్ పుస్తకాల్లో మార్పులు
- రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం
జైపూర్ : ఆరెస్సెస్ సిద్దాంతకర్త సావర్కర్.. దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడంటూ పేర్కొనే పదో తరగతి పుస్తకంలో మార్పులకు రాజస్థాన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పదో తరగతి సోషల్ పుస్తకంలోని స్వాతంత్య్ర సమరయోధులు అనే అధ్యాయంలో సావర్కర్ జీవిత చరిత్రను చేర్చుతూ వసుంధరా రాజే నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో సావర్కర్ను దేశవిభజనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఒక దేశభక్తుడిగా పేర్కొంటూ పాఠ్యాంశంలో చేర్చారు. అయితే అశోక్గెహ్లాట్ నేతృత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. కాషాయీకరణే లక్ష్యంగా గత బీజేపీ ప్రభుత్వం పాఠశాల పుస్తకాల్లో చేర్చిన పలు అంశాలలో మార్పులకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సావర్కర్ బయోగ్రఫీలో ఆయనను దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడంటూ పేర్కొనే అంశాల తొలగింపునకు గెహ్లాట్ సర్కారు నిర్ణయం తీసుకున్నది. అలాగే గాంధీ హత్య కేసులో నాథురాం గాడ్సేకు సహకరించి కుట్రదారుడిగా ఆరోపణలు ఎదర్కొన్న అంశాన్ని, బ్రిటీష్ ప్రభుత్వానికి ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు వంటి అంశాలను సైతం పదోతరగతి పాఠ్యపుస్తకంలో చేర్చడానికి రాష్ట్ర విద్యాశాఖ సిద్దమైంది. 'సొంత ఎజెండాతో గత బీజేపీ ప్రభుత్వం సావర్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది. ఆయనను స్వాతంత్య్ర సమరయోధుడిగా పేర్కొన్నారు. కానీ, అది నిజం కాదు. వాస్తవాలను అందించాలనే ఉద్దేశంతోనే బలమైన ఆధారాలతో కమిటీ సిఫారసుల మేరకు మార్పులు చేస్తున్నాం' అని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతసరా అన్నారు.