Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాగ్రత్త వహించడంలో పలు కంపెనీలు నిర్లక్ష్యం
- తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : సైబర్దాడుల విషయంలో భారత కంపెనీలకు మరో షాకింగ్ విషయం ఎదురైంది. భారత్లోని 69శాతం కంపెనీలు సైబర్దాడి ప్రమాదంలో ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటికే దేశంలో ప్రముఖ కార్పొరేట్, ఐటీ సంస్థలు అనేకం సైబర్దాడులను ఎదుర్కొన్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో సంబంధం లేకుండా సైబర్వీరులు సమాచారాన్ని తస్కరిస్తూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ విశ్లేషణ సంస్థ ఫ్రోస్ట్ అండ్ సులివాన్ చేసిన అధ్యయనాన్ని ఇటీవలే గ్లోబల్ సైబర్ సెక్యురిటీ లీడర్ ఫోర్స్పాయింట్ విడుదల చేసింది. ఈ అధ్యయనంలో ఆసియా పసిఫిక్ రీజియన్లోని దాదాపు 400కు పైగా సంస్థలు పాల్గొన్నాయి. ఇందులో భారత్, సింగపూర్, హాంకాంగ్, ఆస్ట్రేలియా నుంచి 100 చొప్పున కంపెనీలున్నాయి. ఇందులో ఫైనాన్సియల్, టెలికాం, మానిఫాక్షరింగ్, రిటైల్, ఎడ్యుకేషన్, హెల్త్కేర్ వంటి పలు రంగాలకు చెందిన సంస్థలున్నాయి. భారత్లో దాదాపు 69శాతం కంపెనీలు తీవ్రమైన సైబర్దాడి ప్రమాదంలో ఉన్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. అలాగే ఆస్ట్రేలియాలోని 63శాతం కంపెనీలకు ఇదే పరిస్థితిలో ఉన్నట్టు వివరించింది. గత 12నెలల సమయంలో దాదాపు 35శాతం సంస్థలు కనీసం ఒక్క సైబర్దాడి ప్రమాదాన్నైనా ఎదుర్కొన్నాయని తేలింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టుల విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దాదాపు 83శాతం కంపెనీలు అసలు సైబర్ దాడి భద్రత గురించే ఆలోచించడంలేదని వెల్లడైంది. సైబర్దాడుల విషయంలో మెజారిటీ కంపెనీలు(72శాతం) ఎప్పటికప్పుడూ జాగ్రత్తపడుతున్నాయని, అయితే ఇప్పటికీ 55శాతం కంపెనీలు ఇంకా 'సైబర్' ప్రమాదపుటంచుల్లోనే ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది. సైబర్ సెక్యురిటీ విషయంలో అనేక సంస్థలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయని ఏపీఏసీ ఐసీటీ, ఫ్రోస్ట్ అండ్ సులివాన్ ఇండిస్టీ ప్రిన్సిపాల్ కెన్నీ యో తెలిపారు.
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్పై ప్రయాణం చేస్తున్న 95శాతం కంపెనీలు సైబర్ సెక్యురిటీ విషయంలో ఆధునిక సాంకేతికతలైన క్లౌడ్ కంప్యూటింగ్, మొబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్లుతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. డిజిటలైజేషన్లో భాగంగా ఏపీఏసీ కంపెనీలలో ఇదొక పెద్ద మార్పు అన్ని అధ్యయనం స్పష్టం చేసింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టుల విషయంలో సైబర్దాడుల కారణంగా తీవ్ర విఘాతాన్ని తాము ఎదుర్కొన్నామని 65శాతం కంపెనీలు వెల్లడించడం గమనార్హం.