Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటర్ల ప్రాధాన్యాంశాలు :నేషనల్ ఎలక్షన్ వాచ్, ఏడీఆర్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పట్నుంచీ ప్రధాని మోడీ, ఆయన బృందమంతా కలిసి బాలాకోట్ దాడులు, సీమాంతర ఉగ్రవాదం, సైనికుల ప్రతిభా పాటవాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రచారం సాగిస్తున్నాయి. ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నా.. ఒక్క బీజేపీ నాయకుడూ ప్రజల కోసం తాము ఈ తరహా అభివృద్ధి పనులు చేస్తామన్నా పాపాన పోలేదంటే అతిశయోక్తి కాదు. అయితే, ప్రజలు నిజంగా కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వం నుంచి ఇవే కోరుకుంటున్నారా..? అంటే సమాధానం కాదనే వస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, ప్రజలు అనారోగ్యం పాలైనప్పుడు వారికి మెరుగైన వైద్యం, తాగడానికి మంచినీరు వంటి కనీస సౌకర్యాలను వారు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మర్స్ (ఏడీఆర్)లు చేపట్టిన సర్వేలో తేలింది. 534 పార్లమెంట్ నియోజకవర్గాలలోని 2 లక్షల 73 వేల 487 మంది ఓటర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సర్వేను 2018 డిసెంబర్లో నిర్వహించినట్టు ఏడీఆర్ ప్రతినిధి జగ్దీప్ చోకర్ తెలిపారు. 31 అంశాలను ఆధారం చేసుకుని ఈ సర్వే చేపట్టారు.
నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం.. మోడీ సర్కారుకు ఓటర్లు అత్తెసరు మార్కులు వేశారు. ప్రభుత్వ పనితీరుపై పది అంశాలను రూపొందించగా.. ఓటర్లు బీజేపీ సర్కారుకు సాధారణం కంటే తక్కువ (బిలో యావరేజ్) మార్కులు వేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 46.80 శాతం మంది తమకు ఉపాధి కల్పనే తొలి ప్రాధాన్యం అని తెలపగా.. మెరుగైన వైద్య సేవలు కోరిన వారు 34.60 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాలలో మంచి నీటి సౌకర్యం (30.50 శాతం), నాణ్యత గల రోడ్లు (28.34 శాతం), మెరుగైన రవాణా సదుపాయాలు (27.35 శాతం) కోరారు. దీంతోపాటు వ్యవసాయానికి సాగునీరందించాలని 25.62 శాతం మంది కోరగా.. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, సాగుకు వారికి రుణాలందించాలని 25.41 శాతం మంది కోరారు. కాగా మోడీ చెబుతున్న బాలాకోట్ దాడులు అప్పటికింకా జరగలేదు. కానీ, 31 అంశాల జాబితాలో ఉగ్రవాదం కూడా ఉంది. కాగా, ఓటర్లు దీనికి 30 వ ప్రాధాన్యం కల్పించడం గమనార్హం.