Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్లో చేరికపై శత్రుఘ్న సిన్హా
పాట్నా : దాదాపు 20 ఏండ్లు బీజేపీలో కొనసాగిన శత్రుఘ్న సిన్హా.. కాంగ్రెస్లో చేరి సరైన మార్గాన్ని ఎంచుకున్నారని అన్నారు. సరైన మార్గాన్ని, సన్మార్గాన్ని ఎంచుకున్నందుకు బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ నుంచి ఆశీర్వాదాలూ పొందారని చెప్పారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత తాను అద్వానీని కలిశారని, అప్పుడు ఆయన కండ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు. కానీ, పార్టీని వీడొద్దని మాత్రం చెప్పలేదన్నారు. పార్టీ మారుతున్నావా? సరే.. నా ప్రేమ నీతో ఉంటుందని చెప్పారు. వాజ్పేయి ఉచ్ఛస్థాయిలో ఉన్నప్పుడు పార్టీలో చేరిన శత్రుఘ్న సిన్హా.. అప్పటికి ఇప్పటికి పార్టీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. అప్పుడు ప్రజాస్వామ్యం ఉంటే.. ఇప్పుడు నియంతృత్వం ఉన్నదని చెప్పారు. ప్రస్తుత నాయకత్వం సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదన్నారు. కానీ, తాను అద్వానీలా కాదని, వారు కూర్చోమంటే కూర్చునే రకం ఎంతమాత్రం కాదని తెలిపారు. కాగా, బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్ ఎన్నికలను ప్రభావితం చేస్తాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రతి భారతీయుడు జాతీయవాదేనని, మన ప్రధాని దాటవేసే విధానాన్ని అనుసరిస్తారని అన్నారు. నిరుద్యోగం గురించి అడిగితే.. పుల్వామాను ప్రస్తావిస్తారని విమర్శించారు. ఫలితాలనంతరం ఆయన ప్రధానిగా ఉండబోరని, జోలె పట్టుకుని వెళ్లిపోవాల్సిందేనని అన్నారు.