Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యానికి దూరంగా 'పీఎం ఆవాస్ యోజన' పథకం
- రెండు కోట్ల ఇండ్లు కడతామని ముందు ప్రకటన
- ఆ తర్వాత లక్ష్యం కోటి యూనిట్లకు కుదింపు
- అందులో నిర్మాణం జరుపుంకుటున్నవి 56శాతం
న్యూఢిల్లీ : రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన 'ఇందిరా ఆవాస్' పథకాన్నే కాస్త అటు..ఇటుగా మార్చి మోడీ సర్కార్ ప్రారంభించిన పథకం 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన'(పీఎంఏవై-అర్బన్). స్వంత ఇల్లు లేని పేద కుటుంబాల్లో ఆశలు కల్పించిన పథకం ఇది. సమాజంలో అనూహ్యమార్పుకు ఇది దోహదపడుతుందనీ, ఇల్లులేని ప్రతీ పేద కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామనీ 2015లో ప్రధాని ప్రకటించారు. ఐదేండ్లు గడిచాయి, పథకంలోని ఏ ఒక్క విభాగంలోనూ(ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎమ్ఐజీ) లక్ష్యాన్ని కనీసం 50శాతం పూర్తిచేయలేకపోయారు. పథకం గొప్పతనమంతా కాగితాలకే పరిమితమైందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి.
ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా వెనుకబడిన వర్గం), ఎల్ఐజీ(లో ఇన్కమ్ గ్రూప్), ఎంఐజీ (మిడిల్ ఇన్కమ్గ్రూప్)...మూడు స్కీమ్లను అమలుజేశారు. ఇందులో రుణ అనుసంధానంతో కూడిన సబ్సిడీ కూడా ఉంది. అయితే ఇండ్ల నిర్మాణంలో విపరీతమైన జాప్యం, సరైన జవాబుదారీతనం లేకపోవటంతో చాలాచోట్ల లబ్దిదారులు మధ్యలోనే వదిలేస్తున్నారు. ఒక ఏడాది పునాదులు, మరో ఏడాది పిల్లర్లు, మరో ఏడాది పైకప్పు...పనుల తీరు ఇలా సా..గు..తోం..ది. నాగపూర్, ఢిల్లీ...తదితర నగరాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి ఉన్నప్పటికీ దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన చేయలేకపోయారు.
కోటీ...రెండుకోట్లన్నారు..
కోటీ 88 లక్షల ఇండ్లను కట్టాలని పట్టణ పేదరిక నిర్మూలన విభాగం 'టెక్నికల్ గ్రూప్' లెక్కతేల్చింది. 2012-17 మధ్యకాలానికిగాను కట్టాల్సిన వీటిలో పూర్తయినవి 44శాతం. కోటీ 6లక్షల ఇండ్ల నిర్మాణం కాగితాలపైనే ఉండిపోయింది. ఎల్ఐజీ (లోయర్ ఇన్కమ్ గ్రూప్) విభాగంలో 74.1లక్షల ఇండ్లు కట్టాల్సి ఉంది. 2022నాటికి 2కోట్ల ఇండ్లను కడుతున్నామని మోడీ సర్కార్ మొదట ఘనంగా ప్రకటించింది. క్షేత్రస్థాయిలో సవాళ్లను ఎదుర్కోలేక లక్ష్యాన్ని కోటి ఇండ్లకు మార్చారు.
డిసెంబరు 2018నాటికి అన్ని రాష్ట్రాలకు కలుపుకొని కేంద్రం కేటాయించిన యూనిట్లు 65లక్షలు. గతంలో మంజూరుచేసిన 32లక్షలకు కలుపుకొని 65లక్షల యూనిట్లకు రాష్ట్రాలకు నిధుల్ని విడుదలచేశారు. ఇందులో ఇప్పుడు నిర్మాణంలో ఉన్నవి 35,92,656(56శాతం). డిసెంబరు 2018నాటికి వీటి నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. కేవలం 12.5లక్షల యూనిట్లలో మాత్రమే నిర్మాణం పూర్తయ్యింది. అంటే ప్రతీఏటా సగటున 3.5లక్షల (2012-17)ఇండ్లు పూర్తయ్యాయి.
కేటాయించిన నిధులు
- పథకం కోసం కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన నిధులు అక్షరాలా 'రూ.లక్షా 271'కోట్లు. ఇందులో కేంద్రం ఇప్పటివరకూ వ్యయం చేసింది 33శాతం.
- 'ఇందిరాఆవాస్' పథకం అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని 'పీఎంఏవై(యు)' పథకాన్ని మరింత మెరగ్గా మలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం జరగలేదు.
- పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేది ఎంత? సెల్ఫ్ ఫైనాన్సింగ్(బ్యాంకు రుణం)తో ఎంత ఇస్తున్నారన్న అవగాహన లబ్దిదారుల్లో కల్పించలేకపోయారు.
- చాలా నగరాల్లో ఇండ్ల నిర్మాణానికి ఎంచుకున్న స్థలం, నగరానికి చాలా దూరంలో ఉండటం కూడా లబ్దిదారుల్లో ఆసక్తిని తగ్గించడానికి దారితీసింది.