Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిలిండర్లను తిరిగి నింపించలేకపోతున్న లబ్దిదారులు
- గ్యాస్ ధరల పెంపుతో మూలన పడేస్తున్న వైనం
- ఓ చేత్తో ఇచ్చి మరోచేత్తో లాక్కుంటున్న మోడీ సర్కారు
న్యూఢిల్లీ : 'నిరుపేద మహిళలు కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ పడుతున్న బాధలు చూసి తట్టుకోలేకే వారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నాం. దీంతో వారందరూ పొగ బారినుంచి బయిటపడి ఆరోగ్యంతో జీవిస్తారు. ఈ పథకం కింద దేశంలో ఇప్పటికే 5 కోట్ల కనెక్షన్లు ఇచ్చాం' అని సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా పై విధంగా చెబుతూ ఓట్లడుగుతున్నారు. ఈ పథకంతో నిరుపేదలు లబ్ది పొందుతున్నారని, తద్వారా వారి జీవితాలలో వెలుగులు ప్రసరింపజేస్తున్నామని చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నది. కనెక్షన్లు పొందిన వారిలో దాదాపు 20 శాతం మంది సిలిండర్లను తిరిగి నింపించడం (రీఫిల్లింగ్) లేదని గణాంకాలు చెబుతున్నాయి. కనెక్షన్ తీసుకున్నప్పుడు కూడా వాటిని ఉచితంగా ఇస్తున్నామని మోడీ సర్కారు చెబుతుండగా.. లబ్దిదారులు మాత్రం అదంతా ఒట్టిదేనని, వాటిని తీసుకొనేటప్పుడు ఏజెంట్లకు రూ.1500 నుంచి రూ. 2 వేల వరకూ చెల్లిస్తున్నామని వాపోతున్నారు.
పథకం ఉద్దేశమేమిటి..?
మారుమూల ప్రాంతాలలో బతుకు లీడుస్తున్న పేద మహిళలకు గ్యాస్ సిలిండర్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారనే కారణంతో.. వారికి 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' (పీఎంయూవై) కింద కనెక్షన్లు ఇప్పించాలని ప్రభుత్వం భావించింది. 2016, మేలో మోడీ దీనిని అధికారికంగా ప్రారంభించారు. లబ్దిదారులను గుర్తించి వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించడం పథకం ముఖ్య ఉద్దేశం. అనుకున్నట్టుగానే పథకం ప్రారంభించిన 26 నెలల్లో దాదాపు 5 కోట్ల లబ్దిదారులకు కనెక్షన్లు ఇప్పించారు. ఇందుకోసం 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు గానూ దాదాపు రూ. 8 వేల కోట్లను కేటాయించారు. వాటితో పాటు లబ్దిదారులను 8 కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో రూ. 4,800 కోట్లను కూడా విడుదల చేసింది.
కానీ ఈ పథకానికి నిర్దేశించిన లక్ష్యం నెరవేరలేదు. యూపీ, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో గ్యాస్ కనెక్షన్లు పొందడానికి లబ్దిదారులు మధ్యవర్తులకు దాదాపు రూ.2 వేల వరకు ముడుపులిచ్చుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీనిపై ముఝఫర్నగర్లోని అర్యపురి కాలనీకి చెందిన రుక్సానా స్పందిస్తూ.. రెక్కాడితే గానీ డొక్కాడని తమ లాంటి వారి దగ్గర అన్ని పైసలు ఎలా ఉంటాయని వాపోయారు. ఎన్నో తిప్పలు పడి సిలిండర్లు పొందిన వారంతా దానిని తిరిగి రీఫిల్ చేయాలంటే మాత్రం జంకుతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం సిలిండర్ విలువ దాదాపు రూ. 780 (నాన్ సబ్సిడీ) వరకు ఉన్నది. తమ నెల సంపాదన రూ. 3 వేలకు మించడం లేదని అందులో సిలిండర్కే దాదాపు వేయి రూపాయలు ఖర్చు చేస్తే బ్రతకడమెలాగని వారంతా ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారిలో దాదాపు కోటిన్నర మంది లబ్దిదారులు వాటిని తిరిగి నింపడం లేదని ఆయిల్ మార్కెంటింగ్ కంపెనీ (ఓఎంసీ)లు తెలిపిన గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఇదే విషయమై గతేడాది లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలయం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ.. దాదాపు 20 శాతం మంది తమ సిలిండర్లను తిరిగి రీఫిల్ చేయలేదని తెలపడం గమనార్హం. అంతేగాక, ఈ పథకం కింద లబ్ది పొందిన వారికి సబ్సిడీ కింద ఇచ్చే కిరోసిన్ను నిలిపివేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గుదిబండలా మారిన గ్యాస్ ధరలు
పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పుకుంటున్న మోడీ సర్కారు.. సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచేస్తోంది. సిలిండర్ మీద సబ్సిడీని ఎత్తివేయాలని గతంలో కుట్ర చేసినా ప్రజల ఆగ్రహావేశాలతో దానిపై వెనక్కి తగ్గింది. కానీ, చాపకింద నీరులా నెలా నెలా సిలిండర్ ధరలను పెంచుతోంది. దీంతోపాటు బ్లాక్ మార్కెట్ దందా కారణంగా వాటి రేట్లు సామాన్య ప్రజలకు అవి అందనంత దూరానికి చేరుకుంటున్నాయి. నగరాలలో అయితే ఒక్కో సిలిండర్ విలువ దాదాపు రూ. 1200 నుంచి రూ. 1500 వరకు పలుకుతోంది. మారుమూల గ్రామాల్లోనూ పరిస్థితులు ఇంత కంటే గొప్పగా ఏంలేవు. దీంతో ప్రజలు సిలిండర్ అంటేనే వణుకుతున్నారు. తిరిగి కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్నారు.
ఇన్ని కష్టాలు పెడుతున్న బీజేపీకి ఓటేయ్యం.. జెర్రీఫర్, ముఝఫర్నగర్
సిలిండర్లో గ్యాస్ అయిపోవడంతో నాలు గు నెలలుగా అది మూలనే పడి ఉంది. దానిని నింపించాలంటే వేయి రూపాయలు కావాలం టున్నారు. కానీ అంత స్థోమత మాదగ్గర లేదు. మూడేండ్ల క్రితం ముఝఫర్ పూర్లో జరిగిన అల్లర్లలో నా భర్తతో పాటు మేం సమస్తం కోల్పోయాం. నా జీవనాధారం కోల్పోయాను. ఊళ్లో కూలి పని చేస్తే నెలకు రూ. 2వేలు మాత్రమే సంపాదిస్తున్నాను. వీటితో నేనేలా బతికేది..? కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కా రు వచ్చిన తర్వాత మా కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఈసారి మాత్రం ఆ పార్టీకి ఓటేయ్యబోము. మోడీ పాలనలో మేం మరింత పేదరికంలోకి నెట్టివేయబడ్డాం.