Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రతా సిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ..
జైపూర్ : ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్దాస్ మోడీ రాజస్థాన్లోని ఓ పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తనతో వచ్చే భద్రతా సిబ్బందికీ ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ ఆయన హల్చల్ చేశారు. రాజస్థాన్లోని జైపూర్కు సమీపంలో ఉన్న బగ్రులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మంగళవారం సాయంత్రం ప్రహ్లాద్ మోడీ ఉదరుపూర్ నుంచి జైపూర్కు వచ్చారు. భద్రతా కారణాల రీత్యా ఆయనకు ఇద్దరు వ్యక్తిగత భద్రతా అధికారుల (పీఎస్ఓ)లను కేటాయించారు. నిబంధనల ప్రకారం వారిద్దరూ మోడీ ప్రయాణించే కారులోనే వెళ్లాలి. కానీ దీనికి ఆయన ఒప్పుకోలేదు. పీఎస్వోలకూ ప్రత్యేక వాహనం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బగ్రూ పోలీస్స్టేషన్లో దాదాపు గంటన్నర సేపు ధర్నాకు దిగారు. ఎక్కడికి వెళ్లినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తనకోసం ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాలను ఏర్పాటు చేస్తాయని కానీ జైపూర్ కమిషనర్ మాత్రం ఇందుకు నిరాకరించారని ఆరోపించారు. కాగా దీనిపై కమిషనర్ ఆనంద్ శ్రీవాత్సవ స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం ఆయనకు ఇద్దరు పీఎస్ఓలను ఇచ్చామని కానీ వారికి కూడా ప్రత్యేక వాహనం కావాలని ఆయన పట్టుబడుతున్నారని తెలిపారు. అనంతరం పోలీసుల జోక్యంతో ప్రహ్లాద్ మోడీ నిరసన విరమించారు.