Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్కతాలో వామపక్షాల ర్యాలీ
- అశాంతి సృష్టిస్తున్న బీజేపీ, టీఎంసీ
కొల్కతా :కోల్కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్షా రోడ్షో సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండ, సంఘ సంస్కర్త ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ విగ్రహ ధ్వంసంపై బెంగాల్ వామపక్ష కూటమి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బీజేపీ కార్యకర్తలు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రదేశంలోనే వామపక్ష నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బసు నేతత్వం వహించారు. ర్యాలీలో సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, మహ్మద్ సలీం, నీలోత్పల్ బసు, పశ్చిమబెంగాల్ సీపీఐ(ఎం) కార్యదర్శి సూర్యకాంత మిశ్రా, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్వపన్ బెజర్జీ, పార్వర్డ్ బ్లాక్ నేత హఫీజ్ ఆలం సైరోనీ, ఆర్ఎస్పి నేత సుకుమార్ ఘోష్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కనినికా బోసు, విద్యాసాగర్ ఫౌండేషన్ కార్యదర్శి అనుప్ సర్కార్, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్ తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ కొల్కతాలోని విద్యాసాగర్ ఉద్యాన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ హెదువా సమీపంలోని ఆజాద్ హింద్ బాగ్ వరకూ కొనసాగింది. 40 డిగ్రీల ఎండను తట్టుకొని కూడా ర్యాలీలో విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్షా రోడ్షోలో జరిగిన హింసాకాండ బెంగాల్ సంస్కృతీ, సంప్రదాయాలపై మాయని మచ్చవంటిదని ర్యాలీలో పాల్గొన్న వామపక్ష నేతలు పేర్కొన్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వేస్తున్న మత ప్రలోభాల ఉచ్చులో పడవద్దని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సంఘసంస్కర్త ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ బెంగాల్ పునరుజ్జీవన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించడమేగాక ప్రఖ్యాత హేతువాదిగా సేవలందించారని ర్యాలీ ప్రారంభానికి ముందు ప్రసంగించిన ఏచూరి చెప్పారు. హేతువాదులను అవమానించడం, హతమార్చడం ద్వారా వారి ప్రతిష్టను దెబ్బతీయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు దేశవ్యాప్తంగా కుట్రలు సాగిస్తున్నాయన్నారు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, సంప్రదాయాలను తాము సమర్ధిస్తున్నామని చెప్పుకొనే బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. మతచిచ్చులో పడవద్దని ప్రజలను కోరారు. అత్యంత పురాతనకాలం నాటి విద్యా సంస్థ అయిన విద్యాసాగర్ కాలేజ్పై దాడి చేయటం బెంగాల్ సాంస్కృతిక విలువలను తుంగలో తొక్కటమే అవుతుందని లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బసు చెప్పారు.
ఈ ఘటనపై ఎన్నికల సంఘం సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాసాగర్ కాలేజ్ బెంగాల్ గత వైభవానికి చిహ్నమని, ఆ కాలేజ్పై దాడిని, విద్యాసాగర్ విగ్రహ ధ్వంసాన్ని ఖండించటానికి మాటలు చాలవని ఆయన అన్నారు. ఈ హింసాకాండకు బెంగాల్ ప్రజలే బాధ్యులని బీజేపీ నేతలు చెప్పటం సిగ్గు చేటని, బెంగాల్ ప్రజలు ఇటువంటి దాడులు చేయరని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై అమిత్షా, మమతా బెనర్జీ మాట్లాడుతున్న తీరుపై ఏచూరి స్పందించారు. వారిద్దరి ఆధిపత్య పోరులో రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న శాంతి వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆగ్రహించారు. ప్రజాసమస్యలను విస్మరించి ఇరు పార్టీలు ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయని అన్నారు. మంగళవారం సాయంత్రం ఉత్తర కోల్కతాలో అమిత్షా సారథ్యంలో రోడ్షో కొనసాగుతున్న సమయంలో తృణమూల్ విద్యార్థి సంఘం, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. రెచ్చిపోయిన కాషాయ గూండాలు విద్యాసాగర్ కాలేజ్ కాంపస్లో తీవ్ర విధ్వంసం సృష్టించటంతో పాటు విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.