Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబాన్ని కలిసిన రాహుల్ గాంధీ
జైపూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన అల్వార్ సామూహిక లైంగిక దాడి ఘటన రాజకీయాంశం కాదని, అది భావోద్వేగపూరిత విషయమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయడం తగదని బీజేపీని విమ ర్శించారు. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని ఆయన గురువారం కలిశారు. ఆమెకు, ఆమె కుటుంబానికి వీలైనంత తొందరగా న్యాయం చేస్తామని హామీనిచ్చారు. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించిందన్న మోడీ ఆరోపణలను ఆయన ఖండించారు. 'ఈ ఘటనపై రాజకీయాలు చేయాలని నేను భావించడం లేదు. ఇది నాకు ఒక భావోద్వేగాంశం. మన ఆడబిడ్డలపై ఇలాంటి అరాచకాలని సహించబోమన్న సందేశాన్ని పంపిస్తాను. దోషులను కఠినంగా శిక్షిస్తాం. ఎంతవారైనా వదిలిపెట్టం. బాధితురాలు, ఆమె కుటుంబం నాకు సూచించిన విషయాలన్నింటిపై చర్యలు తీసుకుంటాన'ని చెప్పారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. బీజేపీ కల్పితాలను ప్రచారం చేస్తున్నదని, ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరగలేదని అన్నారు. మోడీ అబద్ధాలకోరు అని అందరికి తెలిసిన విషయమేనని, ఈ ఘటనపై మే 2న ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. రాజస్థాన్లోని అల్వారు జిల్లాలో ఏప్రిల్ 26న దళిత దంపతులను ఐదుగురు దుండగులు హైవేపై అడ్డుకుని.. దళిత మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.