Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల్లేక వ్యసనాలకు బలౌతున్న తివాచీకార్మికులు
- మోడీ దత్తత గ్రామానికి పక్కనే ఉన్నా పట్టించుకోని అధికారులు
- కనీస వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు
లక్నో : వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ వేసినప్పట్నుంచీ కొన్ని ప్రయివేటు ఛానెళ్లు ప్రధాని దత్తత గ్రామాలపై ప్రత్యేక కథనాలు రూపొందిస్తూ ఊదరగొడుతున్నాయి. మీడియా చెప్పిన దానికంటే వాస్తవంగా అక్కడ జరిగిన అభివృద్ధి ఏమీలేదని ఆయా గ్రామాలను పరిశీలిస్తే అవగతమవుతోంది. అయితే, మోడీ దత్తత తీసుకున్న గ్రామాల పరిస్థితే ఇలా ఉంటే దాని చుట్టు పక్కల ఉన్న గ్రామాల స్థితి గతులు ఇంతకంటే అధ్వాన్నంగా ఉన్నాయి. వారణాసి జిల్లాలో ప్రధాని దత్తత గ్రామం జయపురకు ఆనుకుని ఉన్న చంద్పూర్లో ఎక్కువ మంది తివాచీ (కార్పెట్) కార్మికులే. మార్కెట్లోకి అధునాతన తివాచీల రాకతో వీరంతా పనులు దొరక్క దినసరి కూలీలుగా మారారు. పనులు చేసే వారంతా దళితులే కావడంతో వీరంతా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు.
చిన్నతరహా పరిశ్రమల కింద ఉన్న కార్పెట్ ఇండిస్టీని ఆదుకోవడంలో మోడీ, యూపీ సర్కారులు విఫలమయ్యాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బెనారస్ చీరలు లభ్యమయ్యే వారణాసిలోనే నేత మగ్గాల ద్వారా నేసే తివాచీలకు ఒకప్పుడు స్థానికంగా మంచి గిరాకీ ఉండేది. కానీ మార్కెట్లో లభ్యమయ్యే కొత్త తివాచీలతో వీరు పోటీ పడలేకపోతున్నారు. సాంప్రదాయ మరమగ్గాలనే ఉపయోగించడమూ ఇక్కడి వారికి శాపంగా మారింది. అధునాతన యంత్రాలతో పోలిస్తే చేనేత నుంచి ఉత్పత్తయ్యే తివాచీలు తక్కువ కావడమూ వీరికి ప్రధాన సమస్యగా ఉన్నది. అంతేగాక వాటిని నేసేటప్పుడు మగ్గాలు, వస్త్రం నుంచి వెలువడే దుమ్మును పీల్చి చాలామంది కార్మికులు అనారోగ్యం బారీన పడుతున్నారు. మరమగ్గాల స్థానే అధునాతన యంత్రాలను ఇప్పించాలని, వాటిని మార్కెటింగ్ చేసుకునేందుకు తగినన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
కాగా ప్రభుత్వం మాత్రం ఈ దిశగా అడుగులు వేయడం లేదు. వారణాసిలో స్థానికంగా లభ్యమయ్యే వస్తువులకు బ్రాండింగ్ ఇచ్చి వాటిని మార్కెటింగ్ చేయాలని యూపీ సర్కారు నిర్ణయించింది. కానీ ఇందులో బెనారస్ చీరలకు ఇచ్చిన ప్రాధాన్యం తివాచీలకు ఇవ్వలేదు. జిల్లాలోని వంద గ్రామాల నుంచి 713 మంది నేతకార్మికులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక ప్రోత్సహకాలు ఇస్తున్న యూపీ సర్కారు.. తివాచీ కార్మికులను మాత్రం గాలికొదిలేసింది. తివాచీ కార్మికులంతా చమర్లే (దళితులు) కావడమూ ప్రభుత్వం వీరిని పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణమని వీరంతా వాపోతున్నారు.
గ్రామంలో సమస్యల తిష్ట
చంద్పూర్లో సమస్యలు తిష్ట వేశాయి. కనీస వసతులు లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోడీ దత్తత గ్రామం కంటే చంద్పూర్లోనే ఎక్కువ మంది అక్షరాస్యులున్నారని కానీ అధికారులు మాత్రం తమ గ్రామంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. 3 వేల మంది జనాభా ఉన్న తమ ఊరికి చేరుకోవడానికి పక్కా రోడ్డు లేదని.. తాగు నీటి సదుపాయం, పిల్లలు చదువుకోవడానికి పాఠశాల సౌకర్యం లేదని వాళ్లు చెబుతున్నారు.
గ్రామంలో 800 పైచీలుకు మరుగుదొడ్లున్నా అవన్నీ నీటి సమస్య కారణంగా వృథాగా ఉన్నాయని తెలిపారు. తివాచీ పనులు చేసే కార్మికులంతా ఇప్పుడు పనుల్లేక దూర ప్రాంతాలకు దినసరి కూలీలుగా వెళ్తున్నారు. పనుల్లేని యువత గ్రామంలోనే మద్యానికి, పేకాటకు బానిసై తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు మంజూరు కావడం లేదు - కుసుమలత, గ్రామ సర్పంచ్
ప్రధాని దత్తత గ్రామానికి పక్కనే ఉన్నా అధికారులు మా ఊరును పట్టించుకోవడం లేదు. దళితులనే కారణంగానే తివాచీ కార్మికులపై వివక్ష చూపిస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం పై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. మా గ్రామానికి విడుదలయ్యే నిధులు సైతం సరైన సమయంలో మంజూరు కావడం లేదు. మా జిల్లాలో 1,289 గ్రామాలున్నాయి. ఇందులో మోడీ నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అధికారులు వాటి చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారే తప్ప మిగతా ఊళ్లను కన్నెత్తి కూడా చూడటం లేదు. మోడీతో గానీ, యోగితో గానీ మాకు వ్యక్తిగత శతృత్వమేమీ లేదు. ఈసారి బీజేపీకి ఓటేయ్యం. దళితుల ఆత్మబంధువుగా నిలిచిన మాయావతికే ఓటేస్తాం.