Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'అనంత' రైతుల ఆత్మహత్యలు
- బోర్లపై బోర్లు
- అప్పుల కుంపట్లు
ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు రోజురోజుకీ ఆర్థికంగా చితుకుతున్నారు. విత్తనాలు, పురుగు మందులు, నీళ్ల దగ్గర నుండి మార్కెట్ వరకూ రైతు దగా పడుతూనే ఉన్నాడు. గత ఆరు వారాల్లో అనంతపురం జిల్లాలోనే ఎనిమిది మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అనంతపురం: మే 16, గురువారం ఉదయం 6 గంటలు. అప్పుడే తెల్లారింది. కానీ ఆ గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగింది. బుధవారం రాత్రి వరకూ తమతో తిరిగిన రైతు శంకర్ (38) ఇక లేడనే విషయాన్ని చాలా సేపటికిగాని జీర్ణించుకోలేకపోయారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చింతల చెరువులో గురువారం ఉదయం పరిస్థితి ఇది. శంకర్ తనకున్న మూడెకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. ఈ ఏడాది వర్షాభావం, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు వెరసి దిగుబడి తగ్గి నష్టాలకు దారితీశాయి. కన్నీళ్లే మిగిలాయి. సుమారు రూ.4.60 లక్షలపైన అప్పులున్నాయి. బాకీ చెల్లించాలని అప్పులవారు ఒత్తిడి తెచ్చారు. జీవితంపై విరక్తి చెందిన శంకర్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంకర్కు భార్య పార్వతమ్మ, కుమారుడు వీరభద్ర, కుమార్తె విశ్వకుమారి ఉన్నారు. వీరభద్ర ఐటీఐ చదువుతున్నాడు. కుమార్తె పదోతరగతి 8.2 గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించింది. తల్లి నాగమ్మ అతని వద్దనే ఉంటోంది. సంవత్సరాల క్రితం చనిపోయాడు.
మే13న అప్పుల బాధతో బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రవిచంద్ర (28) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న 3 ఎకరాల్లో వేరుశనగ పంట సాగుచేసినా ఏనాడూ పెట్టుబడులు కూడా రాలేదు. రూ.2లక్షలు అప్పులు చేసి మూడు బోర్లు వేశాడు. అయినా ఫలితం లేదు. రూ.70 వేలకుగాను రూ.14 వేలు రెండు విడతల్లో మాత్రమే రుణ మాఫీ అయింది.
మే 3న బ్రహ్మసముద్రం మండలం కొత్తిండ్లుకు చెందిన యలంశెట్టి శ్రీనివాసులు అప్పుల భారంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.లక్ష రుణమాఫీ అన్న ప్రభుత్వం రెండు విడతలలో రూ.40 వేలు మాత్రమే మాఫీ చేసింది. ఇంకా రూ.60 వేలు 4,5 విడతల్లో మాఫీ కావాల్సి ఉంది. అప్పులు రూ.8 లక్షలు అయ్యాయి. మూడు ెఎకరాల్లో వేసిన టమోట పంట నిలువునా ముంచింది.
ఏప్రిల్ 3న నల్లచెరువు మండలం చెరువాండ్లపల్లికి చెందిన పోలే వెంకటరమణారెడ్డి (50) సొంత పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న నాలుగెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. గత ఏడాది రెండు బోర్లు వేశాడు. చుక్కనీరూ పడలేదు. సుమరు రూ.6 లక్షలపైన అప్పులు చేశాడు. మార్చి చివరి వారంలో పొలంలో మళ్లీ మరో బోరు వేశాడు. అయినా ఫలితం లేదు. సుమారు రూ.లక్షపైగా ఖర్చయ్యింది. జీవితంపై విరక్తి చెందిన రైతు వెంకటరమణారెడ్డి తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్బ జలాలు పాతాళానికి చేరాయి. బోర్లలో నీరు ఇంకిపోతుండటంతో తాగునీటి కష్టాలు తప్పలేదు. గత ఏడాది కంటే ఈసారి ఐదు మీటర్లు అదనంగా పడిపోయాయి. గాండ్లపెంటలో అత్యధింగా 83.39 మీటర్లకు నీటి మట్టం పడిపోయింది రాష్ట్రంలో అత్యధికంగా నీటి మట్టం పడిపోయిన మొదటి ప్రాంతాల్లో 22 ప్రాంతాలు జిల్లావే కావడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వం అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించినా.... సహాయక చర్యలు నామమాత్రం. 2001 నుండి అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారుగా 900 మంది రైతులు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండొచ్చు. గత ఐదేండంలలో జిల్లాలో 381 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే టీడీపీ ప్రభుత్వం కేవలం 72 మందిని మాత్రమే పరిహారానికి అర్హులుగా తేల్చింది. రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రూ.937 కోట్లు, రుణమాఫీ 4, 5 విడతలు రూ.1131 కోట్లు, ఇన్స్యూరెన్స్ రూ.217 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల చేయడం లేదు.