Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కసారీ గెలవని వైనం..!
- అందని ద్రాక్షలా కేరళలోని పొన్నానీ స్థానం
- ఈ సారైనా ఆ ఆశ తీరుతుందా?
తిరువనంతపురం : దేశాన్ని చాలా ఏండ్ల పాటు ఏకఛత్రాధిపత్యంతో పాలించిన గత చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్.. కేంద్రంలో ఎన్నో సార్లు అధికారాన్ని చేపట్టింది. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ ల హయాంలో అత్యధిక ఎంపీస్థానాలతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నది. నెహ్రూ, ఇందిరా మొదలుకొని సోనియాగాంధీ వరకు ఆ పార్టీ దేశాన్ని పాలించింది. అయితే ఇంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో మాత్రం 'ఆ ఒక్క ఎంపీస్థానాన్ని' గెలవడానికి మాత్రం ఆపసోపాలు పడుతున్నది. తన శక్తినంత ధారపోసి ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని ఇప్పటికీ సొంతం చేసుకోలేకపోయింది. అదే మలబారుతీరం కేరళ రాష్ట్రంలోని పొన్నానీ లోక్సభ స్థానం. దేశంలో 1951లో మొదటి లోక్సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి పొన్నానీ స్థానం మాత్రం ఒక్కసారంటే ఒక్కసారి కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరలేదంటే ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.
గత 68 ఏండ్ల దేశచరిత్రలో ఎక్కువకాలం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ, పలురాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నది. 1951 అనంతరం దాదాపు 26 ఏండ్ల తర్వాత అంటే 1977లో దేశంలో మొదటి సారిగా కాంగ్రెస్యేతర ప్రభుత్వం(జనతాప్రభుత్వం) అధికారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రభుత్వం 'మూడు'నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తర్వాతి 10 ఏండ్ల పాటు అధికారంలో ఉన్నది. జాతీయ స్థాయిలో ఎవరెస్టు శిఖరం స్థాయిలో ఉన్న ఆ పార్టీకి కేవలం ఒక చిన్న ఎంపీ స్థానమైన పొన్నానీ మాత్రం అందనిద్రాక్షలా మారింది.
1951లో దేశంలో మొదటి సాధారణ ఎన్నికల్లో భాగంగా కేరళలోని పొన్నానీ లోక్సభ స్థానానికి ఎన్నిక జరిగింది. ఆ సమయంలో పొన్నానీ లోక్సభ స్థానానికి ఇద్దరు ఎంపీల(జనరల్ నుంచి ఒకరు, రిజర్వ్డు నుంచి ఒకరు)ను లోక్సభకు పంపే ప్రత్యేకత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తమ జనరల్ అభ్యర్థిగా కరుణాకర మీనన్ను, రిజర్వ్(ఎస్సీ) సీటుకు ఎచరన్ ఇయ్యానీని బరిలో నిలిపింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. కిసాన్మజ్దూర్ ప్రజా పార్టీ చేతిలో జనరల్ సీటును కోల్పోయింది. అక్కడ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థి కేలప్పన్ కోయ్హాపాలికి 1,46,366 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. మీనన్కు మాత్రం 1,36,603 ఓట్లు పోలయ్యి రెండో స్థానంలో నిలిచారు. దీంతో జనరల్ సీటులో కేలప్పన్ చేతిలో మీనన్ ఓడిపోయారు. పొన్నానీ నుంచి తొలి ఎంపీగా కేలప్పన్ లోక్సభలో అడుగుపెట్టారు. ఇక ఎస్సీ రిజర్వ్డ్ అభ్యర్థి ఇయ్యాని 1,20,214 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. దీంతో రిజర్వ్ స్థానం నుంచి ఇయ్యాని పార్లమెంటుకు వెళ్లగలిగారు. ఇక 1957లో పొన్నానీ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరిగనట్టుగా రికార్డులు లేవు. ఈసీ కూడా తన అధికారిక రికార్డుల్లో కానీ, వెబ్సైట్లో కానీ ఎక్కడా పేర్కొనలేదు. ఆ తర్వాత 1962, 67,72లలో జరిగిన ఎన్నికల్లో పొన్నానీ నుంచి సీపీఐ(ఎం) హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నది. ఇక ఆ తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకున్నది. అప్పటి నుంచి పొన్నానీ నుంచి అభ్యర్థిని కాంగ్రెస్ నిలబ్టెలేదు. దీంతో 1977-2014 వరకు ఈ స్థానాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) 11 సార్లు గెలుచుకున్నది. 1951 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 17.64శాతం ఓట్లను పొందింది. అయితే 1971 ఎన్నికల్లో మాత్రం 45.12శాతం ఓట్లను ఆ పార్టీ చేజిక్కించుకున్నది. ఈ సారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఐయూఎంఎల్ సిట్టింగ్ ఎంపీ ఇటి మహ్మద్ బషీర్ బిరిలో ఉన్నారు. అయితే ఉత్తర భారతంతో పాటు దక్షిణాన ఫోక్స్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీకి దిగారు. అయితే రాహుల్ రాకతోనైనా ఆ పార్టీకి పొన్నాని ఆశ తీరుతుందా? లేక అందని ద్రాక్షలాగానే మిగిలి ఉంటుందా? అంటే ఫలితాలు వెలువడే మే 23 వరకు వేచి ఉండాల్సిందే.
కేంద్రపారా, హుగ్లీ స్థానాల్లోనూ...
పొన్నానీ స్థానంతో పాటు దేశంలోని మరో రెండు ఎంపీ స్థానాలూ కాంగ్రెస్ను ఇప్పటికీ కలవరపెడుతున్నాయి. వాటిలో ఒకటి ఒడిషాలోని కేంద్రపారా ఎంపీ స్థానం కాగా, మరొకటి పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నియోజకవర్గం. కేంద్రపారా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 1951లో ఒకసారి మాత్రమే గెలిచింది.
ఇక అప్పటి నుంచి ఆ పార్టీ ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రజలంతా జనతాదళ్, బిజూజనతాదళ్ వంటి పార్టీల వైపు మళ్లడంతో అక్కడ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టంగా మారింది. 1962 ఎన్నికల్లో విజయం వరకు ఆ పార్టీ వచ్చినా కేవలం 66 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ధరిణిధర్ నాయక్ పోటీలో ఉన్నారు.
ఇక వామపక్షాలకు కంచుకోటగా ఉన్న హుగ్లీ స్థానంలో మొదటి నుంచి కాంగ్రెస్కు ఎదురీతే ఎదురైంది. అయితే 1984 తర్వాత ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశంలో జరిగిన ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. అప్పుడు ఆ పార్టీ 50.49 శాతం ఓట్లను పొందింది. ఈ సారి ఎన్నికల్లో హుగ్లీ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా ప్రతుల్ సాహాను కాంగ్రెస్ నిలిపింది.