Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ఉపసంహరణ
- 7 రోజుల తర్వాత సీబీఐ కస్టడీకి గ్రీన్సిగల్
న్యూఢిల్లీ: శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఫిబ్రవరి 5న ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. మరో వారంపాటు గత ఆదేశాలు పని చేస్తాయని తెలిపింది. ఈలోగా ఊరట పొందేందుకు ఆయన తగిన కోర్టును ఆశ్రయించవచ్చునని చీఫ్ జస్టిస్ రంజన్గొగోరు నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో తీవ్రమైన అంశాలున్నాయని ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి సంజీవ్ఖన్నా తీర్పు పాఠంలోని కొంత భాగాన్ని చదివి వినిపించారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో రాజీవ్కుమార్ను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టయింది. ముందస్తు బెయిల్ కోసం రాజీవ్కుమార్ కోల్కతా హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో శారదా చిట్ఫండ్, రోజ్వ్యాలీ కుంభకోణం కేసుల్లో రాజీవ్కుమార్ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్కతా వెళ్లగా స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఆరోజు కోల్కతా పోలీసులు, సీబీఐ అధికారులకూ మధ్య హైడ్రామా నడిచింది. సీబీఐ దర్యాప్తును నిరసిస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి ఆ సందర్భంగా కోల్కతాలో ధర్నా నిర్వహించారు. లక్షలమంది డిపాజిటర్లను ముంచిన శారదా స్కాంలో ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. మొదట ఈ స్కాంపై బెంగాల్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించింది. సిట్కు రాజీవ్కుమార్ నేతృత్వం వహించారు. ఆ సందర్భంగా పలుకుబడి ఉన్న పెద్దల్ని ఈ స్కాం నుంచి రక్షించేందుకు సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు రాజీవ్కుమార్పై ఆరోపణలున్నాయి. ప్రాథమిక సాక్ష్యాధారాలున్నందున రాజీవ్కుమార్ను తమ కస్టడీకి తీసుకొని దర్యాప్తు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది.
మరోవైపు ఎన్నికల సందర్భంగా బెంగాల్లో తనకు అప్పజెప్పిన బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారన్న కారణంతో సీఐడీ అదనపు డీజీ బాధ్యతల నుంచి రాజీవ్కుమార్ను తప్పిస్తూ ఈ నెల 15న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఆయన ఈ నెల 16న కేంద్ర హౌంశాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. కోల్కతాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్షా రోడ్డుషో సందర్భంగా హింస, విధ్వంసం(ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం) జరగడంతో, ఆ మరుసటి రోజే రాజీవ్కుమార్ను తప్పిస్తూ ఈసీ ఆదేశాలివ్వడం గమనార్హం.