Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నలకు జవాబివ్వని మోడీ
న్యూఢిల్లీ:చివరి విడత లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత శుక్రవారం పార్టీ అధ్యక్షుడు అమిత్షాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ మీడియా ప్రతినిధులు సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబివ్వలేదు. ప్రశ్నలన్నింటినీ పార్టీ అధ్యక్షుడు అమిత్షాకు బదిలీ చేశారు. అమిత్షా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని పాల్గొన్నట్లుందని మీడియా ప్రతినిధులు గుసగుసలాడారు. మీడియా సమావేశంలో ముందుగా మాట్లాడిన మోడీ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో తాము మరోసారి పూర్తి మెజార్టీతో గద్దెనెక్కుతామని ధీమా వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాల తరువాత తొలిసారిగా తాము పూర్తి మెజార్టీతో మరోసారి గద్దెనెక్కనున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు 'చివరి వరకూ సేవలందించింద'ని ఆయన చెప్పారు. ఇది భారత దేశ పాలనలో కొత్త సంస్కృతి అని, ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి అసలైన బలం అని ఆయన అన్నారు. అమిత్షా మాట్లాడుతూ ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజాదరణ పొందిందని, మోడీకి లభించిన ప్రజాదరణతోనే తాము ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా ముగించామని చెప్పారు. ఈ ప్రచారంలో ప్రధాని 142 ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించారని, 4 రోడ్షోలు నిర్వహించారని అన్నారు. తమ పార్టీకి 300 స్థానాలు పైగా లభిస్తాయన్న ప్రధాని వ్యాఖ్యలతో ఆయన ఏకీభవిస్తూ మోడీ ప్రయోగాలను ప్రజలు ఆమోదించారని అన్నారు. రాఫెల్ అవినీతిపై బహిరంగ చర్చకు ప్రధాని ఎందుకు ముందుకు రావటంలేదన్న రాహుల్ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ప్రధాని ప్రతి దానికీ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ ప్రశ్నకు తాను బదులిచ్చానని వివరించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రధాని స్పందిస్తారని ఎదురుచూసిన మీడియా ప్రతినిధులకు నిరాశే ఎదురయింది.