Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని దత్తత గ్రామంలో అభివృద్ధికి నోచుకోని దళిత వాడలు
- అగ్రవర్ణాల ఇండ్లు దాటి ముందుకు కదలని పనులు
- ఇదేనా 'సబ్ కా సాత్.. సబ్ కా వికాస్..?'
లక్నో : గ్రామాలలో సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసమని 2014లో మోడీ సర్కారు 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన'ను ప్రారంభించింది. కానీ, స్వయానా ప్రధాని మోడీ దత్తత గ్రామం జయపురలో మాత్రం ఆయన చెప్పిన అభివృద్ధి అగ్రవర్ణాల ఇండ్లు దాటగానే ఆగిపోయింది. అది దళితుల వాడలకు చేరడం లేదు. గ్రామంలో పెత్తందారులకు మంజూరైన పక్కా ఇండ్లు అణగారిన వర్గాల అడ్డాకు చేరుకోలేకపోతున్నాయి. ఇక రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని అణగారిన వర్గాల ప్రజలు వాపోతున్నారు. మోడీ చెబుతున్న 'సబ్కా సాత్.. సబ్కా వికాస్' ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
2014లో ప్రధాని ఆర్భాటంగా ప్రారంభించిన గ్రామాల దత్తత కార్యాక్రమం కింద మోడీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అందులో ఓ గ్రామం జయపుర. ఇది వారణాసికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మోడీ రాకతో ఆ గ్రామ ప్రజలంతా 'సాక్ష్యాత్తు ప్రధానే మా గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇక మా బతుకులు మారినట్టే' అనుకున్నారు. కానీ వారి ఆనందం ఎంతోకాలం నిలువలేదు. ఇది ప్రారంభించిన కొత్తలో అధికారులు 'స్వామిభక్తి' ప్రదర్శించాలనే ఆత్రుతతో ఈ గ్రామాన్ని పలుమార్లు సందర్శించి దాని 'రూపురేఖలు' మార్చుతామని నమ్మబలికారు. అనుకున్నదే తడువుగా అక్కడ ఓ పోస్టాపీసు, బస్షెల్టర్, రెండు బ్యాంకులూ వెలిశాయి. దీంతో పాటు అక్కడక్కడా సిమెంటు రోడ్లు.. పెత్తందార్లు ఉంటున్న కాలనీలకు విద్యుత్, నల్లాద్వారా తాగునీటి సదుపాయం.. కొన్నిచోట్ల పక్కా ఇండ్లు వంటివి కట్టించారు. కానీ, ఆ ఇండ్లను దాటి ముందుకు వెళ్తే వచ్చే దళిత వాడల రూపురేఖలు మాత్రం ఏమీ మారలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వారి బతుకుల్లో ఏమార్పూ రాలేదు. దళితుల ఇండ్ల నుంచి వెళ్లే అంతర్గత రహదారి పూర్తి గుంతలతో నిండి ఉంది. దాని పక్కనే మురుగు నీరు దుర్గందం వెదజల్లుతూ ప్రవహిస్తోంది.
అందరికీ మరుగుదొడ్ల కల్పన పేరుతో దళితులకు గుజరాత్ నుంచి ప్రత్యేకంగా ఫైబర్తో తయారుచేసిన టారులెట్ బేసిన్లను తీసుకొచ్చి అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో బిగించారు. కానీ ఒక్క వర్షానికే మోడీ కట్టించిన బాత్రూంలతో పాటు 'గుజరాత్ మోడల్' టారులెట్ బేసిన్లు పగిలిపోయాయి. దీంతో వాటిని మూలకు పడేసి మునపటి మాదిరిగా బహిరంగ మల విసర్జనకే వెళ్లుతున్నామని రాజేశ్ కుమార్ తెలిపాడు. ఇక ఇండ్లు లేక అధికారులకు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా వాళ్లు తమ మొర ఆలకించడం లేదని దళితులు వాపోతున్నారు. దీంతో చాలామంది ఇప్పటికీ గుడిసెల్లోనే నివసిస్తున్నారు. మరికొంత మంది శిథిలావస్థకు చేరుకున్న మట్టి ఇండ్లలోనే బతుకులీడుస్తున్నారు.
ఇక దళిత బస్తీలో తాగునీటి సదుపాయం కోసమని అధికారులు మూడు బోర్లను వేయించారు. కానీ వాటి నుంచి ఇండ్లకు నీటిని తరలించే పైపులు మాత్రం నాణ్యత లేనివి వేయకపోవడంతో ఆ బోర్లు కూడా నిరుపయోగంగా మారాయి. ఉచిత విద్యుత్ అందిస్తామని మోడీ సర్కారు చెప్పినా.. స్థానిక బీజేపీ నాయకులు మాత్రం చేతివాటం చూపిస్తున్నారు. కాగా ఈ గ్రామాన్ని చూడటానికి వచ్చే మీడియా, పరిశీలకులు అగ్రవర్ణాల ఇండ్ల వరకే పరిమితమవుతున్నారని.. అవి దాటి వస్తేనే ఇక్కడ అసలు 'అభివృద్ధి' విషయం తెలుస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం ప్రారంభించే ఇటువంటి పథకాల బదులు తమ ఊళ్లో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి అందులో పని కల్పిస్తే తమకు ఉపాధి దొరుకుతుందని వారు కోరుకుంటున్నారు.
నాలుగేండ్లుగా భయం భయంగానే.. సుమన్, జయపుర
మాది మట్టి ఇళ్లు. మా ఊరిని మోడీ దత్తత తీసుకున్నాక మాకు పక్కా ఇళ్లు వస్తుందని ఆశించాం. కానీ నాలుగేండ్లు గడిచినా నాకు ఇళ్లు మంజూరు కాలేదు. మా ఇళ్లేమో కూలడానికి సిద్ధంగా ఉన్నది. అయినా మేం ఇందులోనే ఉంటున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇంటికోసం నేను ఇప్పటికే నాలుగుసార్లు దరఖాస్తు చేసుకున్నాను. కానీ, నా పేరు మాత్రం పీఎంఏవై జాబితాలో లేదు. నా మిత్రుడొకాయనదీ ఇదే పరిస్థితి. అతడికి ఇళ్లు మంజూరైనా అధికారులు పైసలు మాత్రం ఇవ్వడం లేదు. మోడీ ఎప్పుడూ అగ్రవర్ణాల కోసమే పనిచేస్తారు.