Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాపై దాడి..
- జర్నలిస్టుల హత్యలు
- ఫేక్ న్యూస్.. విద్వేషం.. మూకదాడులు
- విమర్శకులపై ఉక్కుపాదం
- బీజేపీ అతివాద రాజకీయాలు
న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశ రాజకీయాల్లో పలు ఆందోళనకరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఐదేండ్లలో ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లోకి వెళ్లింది. దేశంలో విద్వేష ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. మీడియాపై ఒత్తిడి పెరిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ అనే విభజనే కాదు.. ప్రభుత్వ అనుకూల, వాస్తవాలను ఎత్తిచూపే మీడియా, వార్తాసంస్థలుగానూ విడిపోయాయి. సామాజిక మాధ్యమాలు ప్రజలకి మరింత చేరువకావడం.. ఆ మాధ్యమాలతో నకిలీ వార్తలు, తప్పుడు బైనరీల సమాచారాన్ని చేరవేసి మత విద్వేషాలు పెంచే ప్రయత్నాలు పెరిగాయి. దళితులు, ముస్లింలపై అనేక మూకదాడులు చోటుచేసుకున్నాయి. మూకదాడులకు పాల్పడినవారికి అధికార పార్టీ(బీజేపీ) నేతల అభినందనలు, తోడ్పాటు అందడంతోపాటు.. మాలేగావ్ పేలుడు కేసులో నిందితురాలికి టికెట్ ఇచ్చి బీజేపీ అతివాద రాజకీయాలకు తెరలేపింది. విమర్శకులు, ఆందోళనకారులపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. జైళ్లకు తరలిస్తున్నది.
వాట్సాప్ వర్సిటీ.. మీడియా
ఈ ఐదేండ్లలో రాజకీయ చర్చ ఘర్షణాత్మకంగా మారింది. దీంతో ప్రజల జీవితాల్లో భాగంగా మారుతున్న సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపు ప్రచారం ముమ్మరమైంది. మీడియాలోని వార్తల కంటే.. వాట్సాప్లో వండివార్చిన వార్తలు.. కల్పిత కథనాల ప్రభావం పెరగడం మొదలైంది. విభజన రాజకీయాలకు ఊతమిచ్చేలా తప్పుడు బైనరీ వార్తల విధానాలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు లౌకికవాది వర్సెస్ జాతీయవాది, అధికారపక్షానికి మూఢభక్తి వర్సెస్ జాతిద్రోహంలాంటి తప్పుడు బైనరీలు చలామణిలోకి వచ్చాయి. మునుపెన్నడూ లేనివిధంగా వాట్సాప్లో నకిలీ వార్తల మూలంగా అనేక మూక దాడులు జరిగాయి. మరో వైపు మీడియాపై నమ్మకాన్ని దిగజార్చే కుట్రలకూ బీజేపీ పాల్పడింది. ప్రస్తుత ప్రభుత్వంలోని ఓ మంత్రి మీడియాను ప్రెస్టిట్యూడ్(వార్తా వ్యభిచారం) అని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, వాస్తవ కథనాలు, వార్తలు రాసిన జర్నలిస్టుపై దాడులు పెరిగాయి. హత్యలూ జరిగాయి. ప్రముఖ పాత్రికేయులు గౌరీ లంకేశ్, శాంతను భౌమిక్, షుజాత్ బుకారీలవంటి వారు ఈ కాలంలోనే హత్యకు గురయ్యారు. వీరితోపాటు, హేతువాదులు, మేధావులపైనా దాడులు జరిగాయి. ఇదే కాలంలో కొన్ని ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలుగాను, మరికొన్ని వాస్తవ కథనాలు ప్రచురించే ప్రత్యామ్నాయ మీడియా సంస్థలుగానూ విడిపోవడం గమనార్హం. దీంతో ఈ ఐదేండ్లలో మీడియాపైనా ప్రజలకు కొద్దిమేరకు నమ్మకం సడలింది.
అతివాద రాజకీయాలు
బీజేపీ అతివాద రాజకీయాలకు తెరలేపింది. అజ్ఞానాన్ని ఆయుధంగా వాడుకుని హిందూత్వ పేరిట రెచ్చగొట్టి, మత విభజనలకు పూనుకుని ఘర్షణలకు పురికొల్పుతున్నది. ఈ క్రమంలోనే గో హంతకుల పేరిట ముస్లింలపై దాడులు జరిగాయి. ఇలాంటి ఘటనలో యూపీలో ఓ పోలీసు అధికారీ చనిపోయాడు. దళితులు, మహిళలపైనా దాడులు పెరిగిపోయాయి. కాగా, మూకదాడికి పాల్పడిన ఎనిమిది మందికి ఒక కేంద్ర మంత్రి గతేడాది సన్మానించడం అప్పుడు చర్చనీయాంశంగా మారింది. గౌరీ లంకేశ్, దబోల్కర్, పన్సారే, కల్బుర్గీల హంతకులకు సంబంధమున్న ఓ హిందూత్వ సంస్థను సర్కారు కనీసం నిషేధించలేదు. ఆరెస్సెస్ ప్రచారం చేస్తున్న హిందూత్వ జాతీయవాదాన్ని అంగీకరించనివారిపై దాడులకు తెగబడుతున్నది. ఇతర దేశాలకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశిస్తున్నది. ఇక సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ గురించి ప్రస్తావించనక్కర్లేదు. తాజాగా మాలేగావ్ కేసులో ప్రధాన నిందితురాలైన సాధ్వి ప్రగ్యాకు టికెట్ ఇచ్చి హిందూ ఉగ్రవాదాన్ని బీజేపీ బాహాటంగా వెనుకేసుకొస్తున్నదనే విమర్శలు వినిపించాయి.
సంఫ్ పరివార్.. ముస్లింలను పాకిస్థాన్తో, క్రైస్తవులను పాశ్చాత్య దేశాలతో లంకె కట్టి, కమ్యూనిస్టులు, వామపక్ష కార్యకర్తలందరినీ జాతి ద్రోహులుగా ప్రచారం చేసింది. చేస్తున్నది. ఈ విధానాలను ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాలో నిరంతరం శ్రమిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారింది. మనదేశంలోని బహుదేవతారాధ్య ఆచారం.. భిన్న చారిత్రక, సంస్కృతి, సంప్రదాయాలతో జతకట్టి ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేసేందుకు దోహదపడాలి. కానీ, ఈ వైవిధ్యంతోనే నేడు విద్వేషానికి దారితీసే పరిస్థితులను కల్పిస్తున్నారు. ప్రపంచ దేశాలను పరిశీలిస్తే.. ప్రజాస్వామ్యం ఒక దశ కాదనీ, అది ఒక పరిణామ క్రమమని అర్థమవుతుంది. ఇతర జాతులు, తెగలు, సమూహాలపై వివక్షచూపే నేతలు.. ప్రజాస్వామ్య దేశాలుగా ఖ్యాతి గడించిన యూఎస్, ఇతర యూరప్ దేశాల్లో అధికారంలోకి రావడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ పాలనను సమీక్షించి కొత్త ప్రభుత్వానికి ఎజెండాను ముందుపెట్టాల్సిన అవసరముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. దేశద్రోహులే!
ఈ ఐదేండ్లలో అధికారంలోని బీజేపీ విమర్శకులపై ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వాన్ని లేదా ప్రధాన మంత్రిని విమర్శించినవారిని కటకటాల్లోకి నెట్టింది. ఉదాహరణకు మణిపూర్ జర్నలిస్టు కిశోర్చంద్ర వాంగ్ఖేమ్ ప్రధానిని, బీజేపీని విమర్శించినందుకు దేశద్రోహం కింద జైలుకు పంపారు. జమ్మూ కాశ్మీర్, దండకారణ్య ప్రజల ప్రాథమిక హక్కుల కోసం గళమెత్తుతున్న మేధావులు, హక్కుల కార్యకర్తలపైనా తీవ్ర అభియోగాలు మోపి బెయిల్రాకుండా జైళ్లకు పంపిస్తున్నారు.