Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతిపిత గాంధీపైనా బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : అరెస్టులకు తాను భయపడేదిలేదని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ వ్యవ స్థాపకుడు కమల్హాసన్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాదిగా పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్కు హిందూత్వ సంస్థల నుంచి ఎదురవుతున్న నిరసన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. ఈ విషయాన్ని తాను చెప్పటం ఇది తొలిసారికాదన్నారు. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు, అతివాదులూ ఉన్నారనీ చరిత్ర చెబుతున్నదని అన్నారు. రాజకీయాల్లో నాణ్యత తగ్గిపోతున్నదని చెప్పారు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి.. కానీ తనను అరెస్టు చేస్తే మరిన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అన్నారు. అరెస్టు విషయంలో తాను హెచ్చరించడం లేదు.. సలహా మాత్రమే ఇస్తున్నానని కమల్ హాసన్ తెలిపారు.
సాధ్వీ బాటలో.. బీజేపీ నేతలు
నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ వ్యాఖ్యానించిన సాధ్వి ప్రగ్యాసింగ్ బాటలో బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డే, మరో ఎంపీ కాతీల్, బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ సౌమిత్ర సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ బాటలో నడిచారు.
గాడ్సే ఉంటే
సంతోషించేవారు : అనంత్కుమార్ హెగ్డే
ఏడు దశాబ్దాల తర్వాత ఇవాల్టి తరం వాళ్లు గాడ్సేపై చర్చ జరపడం సంతోషంగా ఉందని, ఎట్టకేలకు దీనిపై చర్చ జరగడం చూసి నాథూరామ్ గాడ్సే సంతోషించేవారని హెగ్డే ట్వీట్చేశారు. దానిపై తీవ్ర విమర్శలు రావటంతో వాటిని డిలీట్ చేశారు. కాగా, రాజీవ్గాంధీని గాడ్సే, కసబ్తో పోల్చారు దక్షిణ కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ నళిన్కుమార్ కతిల్. గాడ్సే ఒక్కర్నే చంపితే, కసబ్ 72 మంది చంపారని, రాజీవ్ గాంధీ 17,000 మందిని చంపారని, దానిని బట్టి ఎవరు క్రూరుడో నిర్ణయించుకోవచ్చని కతిల్ వ్యాఖ్యానించి మరింత వివాదం రేపారు.
'గాంధీ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్'
'మహాత్మ గాంధీ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్' అని బీజేపీ ప్రతినిధి అనిల్ సౌమిత్ర సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ చేశారు. గాంధీ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అంటూ భారత్లో గాంధీ వంటి వారు కోట్లాది మంది పుట్టారని, వారిలో కొందరు దేశానికి ఉపయోగపడగా, మరి కొందరు పనికిరానివారని అనిల్ శుక్రవారం తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేయడంతో అనిల్ను పార్టీ ప్రాథమిక సభ్యతం నుంచి తొలగిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. తన వ్యాఖ్యలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ రాకేష్ సింగ్ స్పష్టం చేశారు. కాగా అనిల్ మధ్యప్రదేశ్లో బీజేపీ మీడియా వ్యవహారాల విభాగం బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.
నష్టనివారణ చర్యల్లో కాషాయదళం
చివరి విడత ఎన్నికలు ఈ నెల 19న జరు గనున్న నేప థ్యంలో బీజేపీ నేతల వివా దాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీ అగ్రనేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నాథూరం గాడ్సే గొప్ప దేశభక్తుడని భోపాల్ లోక్సభ అభ్యర్థి, బీజేపీ నాయకురాలు ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతిపితను అవమానించిన ఆమెను తాను క్షమించబోనని ఆయన చెప్పారు. మరోవైపు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల చుట్టూ దుమారం చెలరేగడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నష్ట నివారణ చర్యలకు దిగారు. గాడ్సే దేశభక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్, అగ్నికి ఆజ్యం పోస్తూ ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా ట్వీట్లు చేసిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే, నళిన్ కుమార్ కతిల్ 10 రోజుల్లోగా తమ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని అమిత్షా ఆదేశించారు. ఆ ముగ్గురి స్టేట్మెంట్లను క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఈ మేరకు అమిత్షా వరుస ట్వీట్లు చేశారు.
ప్రజలు క్షమించి ప్రగ్యాసింగ్ను గెలిపించాలా?
గాంధీని హత్యచేసిన గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ ప్రగ్యాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆమెను క్షమించబోమని ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ అధ్యక్షఁడు అమిత్ షా ప్రకటించారు. అదే సమయంలో భోపాల్ నుంచి బరిలో ఉన్న ఆమె అభ్యర్థిత్వంపై వారిద్దరూ ఎటువంటి ప్రకటన చేయలేదు. అంటే ప్రగ్యాసింగ్ను మోడీ, అమిత్షా, బీజేపీ క్షమించనప్పటికీ, ప్రజలంతా ఆమె వ్యాఖ్యలను క్షమించి, ఆమెకు మద్దతుగా నిలిచి గెలిపించాలా? అనే చర్చ మేధావుల్లో సాగుతోంది. ఇప్పటికైనా ఆమె అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆమెను ఓడించి, అటువంటి భావజాలం ఉన్నవారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పలువురు మేధావులు, అభ్యుదయవాదులు పిలుపునిస్తున్నారు.