Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
చండీగఢ్ : ఈ లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలవకుంటే రాజీనామా చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. పంజాబ్లో పార్టీ మెరుగైన రీతిలో స్థానాలు గెలుపొందకపోతే దానికి తానే బాధ్యత వహించి వైదొలుగుతానని అన్నారు. గెలుపునకు గానీ, ఓటమికి గానీ మంత్రులు, ఎమ్మెల్యేలు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిందని, దీనికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శిరోమణి అకాలీదళ్, బిజెపి కూటమి పాలన అనంతరం 2017లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. చండీగఢ్ స్థానంలో తన భార్య కౌర్కు టిక్కెట్ ఇవ్వలేదన్న నవ్యజోత్ సిద్దూ వ్యాఖ్యలపై అమరీందర్ సింగ్ స్పందిస్తూ అమృతసర్ స్థానంలో టిక్కెట్టు ఇచ్చేందుకు పార్టీ సిద్ధపడినా పోటీచేసేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని అన్నారు. ఏదేమైనా టికెట్ల కేటాయింపులో పార్టీ నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. చండీగఢ్ నుండి పవన్కుమార్ బన్సల్ను కాంగ్రెస్ అధిష్టానం బరిలోకి దించింది.