Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తి మెజారిటీితో ప్రభుత్వం ఏర్పాటు : ప్రధాని
- ప్రశ్నలకు జవాబివ్వని మోడీ
- మౌన ప్రేక్షకుడినని దాటవేత.. అమిత్షాకు బదిలీ
- ప్రధానిని ప్రజలే నిర్ణయిస్తారు :రాహుల్
- ఎవరుండాలన్నది 23న తేలుతుంది
- ఈసీ పక్షపాత వైఖరి
న్యూఢిల్లీ: చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియడంతో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా మీడియా సమావేశాలు పెట్టాయి. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉమ్మడి సమావేశం పెట్టగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. తమకే తిరిగి ప్రజలు పట్టం కట్టబోతున్నారని మోడీ, అమిత్షా అన్నారు. అవినీతి, ద్రవ్యోల్బణం తగ్గించగలిగామని తెలిపారు. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రెస్మీట్లో పాల్గొన్న ప్రధాని మోడీ మీడియా ప్రతినిధులు సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు. ప్రశ్నలన్నింటినీ అమిత్షాకు బదిలీ చేశారు. తాను మీడియా నుండి ఎటువంటి ప్రశ్నలనూ స్వీకరించబోనని, ఇది పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అయినందున తాను మౌన ప్రేక్షకుడినేనని అన్నారు. బీజేపీ వ్యవస్థలో క్రమశిక్షణ అనుసరించాల్సి వుంటుందని, తామంతా క్రమశిక్షణ కలిగిన పార్టీ సైనికులమని చెప్పారు. మరోవైపు రాహుల్ మాట్లాడుతూ.. మోడీ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఈ ఎన్నికల్లో ఈసీ పక్షపాత వైఖరితో వ్యవహరించిందని విమర్శించారు.
దేశానికి కాబోయే ప్రధాని ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా చివరి విడత ప్రచారం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీలో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ప్రధానిగా ఎవరుండాలనే విషయం ఈనెల 23తో తెలిసిపోతుందన్నారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) పనితీరుపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నిబంధనలు అతిక్రమించి ఏం మాట్లాడినా ఈసీ పట్టించుకోలేదని.. కానీ ఇతర పార్టీల నాయకులపై మాత్రం చర్యలు తీసుకుందన్నారు. ప్రధాని అయిన తర్వాత మోడీ నిర్వహించిన తొలి విలేకరుల సమావేశంపై స్పందిస్తూ.. 'చాలా ఆకట్టుకుంద'ని ఎద్దేవా చేశారు. రాఫెల్పై చర్చకు రావాలని మోడీకి తాను చాలాసార్లు సవాల్ విసిరానని, కానీ దీనికి ఆయన ఎప్పుడూ స్పందింలేదన్నారు. దీనిపై విలేకరులు ఆయనను ప్రశ్నించాలని కోరారు. గాడ్సేని దేశభక్తుడిగా కీర్తించిన బీజేపీ భోపాల్ అభ్యర్థి ప్రగ్యా సింగ్ ఠాకూర్పై మాట్లాడుతూ.. బీజేపీ హింసను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. మోడీ, అమిత్ షాల సిద్ధాంతాలు గాంధీ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకమని విమర్శించారు. గడిచిన ఐదేండ్లలో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్రను పోషించామని రాహుల్ అన్నారు. తమ పనితీరుకు 'ఏ' గ్రేడ్ ఇచ్చుకుంటున్నామని తెలిపారు. మోడీ సర్కారు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఎండగట్టామని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలలో సహకరించిన ప్రతి ఒక్కరికీ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.