Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్లో బీజేపీకి లెఫ్ట్ మద్దతు వార్తలపై ఏచూరి ఖండన
- మీడియా సమావేశంలో వెల్లడి
- రాష్ట్రాన్ని తృణమూల్, కాషాయం నుంచి రక్షించేది వామపక్షాలే
- దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కృషి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
పశ్చిమ బెంగాల్లో సీపీఐ(ఎం) ఇతర వామపక్షాలు క్షేత్రస్థాయిలో బీజేపీకి మద్ధతు ఇస్తున్నాయని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయని... అందులో ఎటువంటి వాస్తవం లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ... ఇటీవల కథనాలను జర్నలిస్టులు ఆయన దృష్టికి తీసుకురాగా, ఆయన వాటిని కొట్టి పారేశారు. బెంగాల్లో తమ ఎన్నికల పంథా పూర్తిగా స్పష్టమని అన్నారు. అయినప్పటికీ మీడియాలో పెద్ద ఎత్తున వక్రీకరణ జరగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ద్వారా పోటీ ఆ రెండు పార్టీల మధ్యనే అన్న వాతావరణ పరిస్థితి కల్పించేందుకు కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక బీజేపీ, తృణమూల్ ఇరు
పార్టీలు ఉన్నాయని వెల్లడించారు. ఇటువంటి ప్రచారాలను నమ్మ వద్దని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. కాషాయవాదులు, తృణమూల్కు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని పునరుద్ఘాటించారు. హింసను ప్రోత్సహిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే బీజేపీని బెంగాల్లో మరింత బలోపేతం చేస్తున్నదని ఆరోపించారు. ఇటువంటి హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకే తమ పార్టీ కృషి చేస్తుందని వెల్లడించారు. ప్రజాస్వామ్య వాతావరణం సృష్టిస్తేనే దేశంలో ప్రతి విషయాన్ని పరిష్కరించగలమన విశ్వాసం వ్యక్తం చేశారు.