Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో నిరుద్యోగ తాండవం
- ఫలితాలివ్వని పట్టణ, గ్రామీణ ఉపాధి పథకాలు
- నత్తనడకన 'కేంద్ర' ఉద్యోగ నియామకాలు
- కేంద్రంపై యువత ఆగ్రహం
న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశంలోని యువత ఉద్యోగాలు లేక విలవిలలాడుతోంది. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్ర సర్కారు విఫలమవుతోంది. పట్టణ, గ్రామీణ ఉపాధి పథకాలను, నైపుణ్య శిక్షణల కార్యక్రమాలను ప్రవేశపెట్టి నిరుద్యోగ యువతకు ఎంతో చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కారు క్షేత్రస్థాయిలో వాటి అమలుతీరును మాత్రం పట్టించుకోవడంలేదు. అదీ చాలదన్నట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికీ కేంద్రం ఆపసోపాలు పడుతోంది. పథకాలను, కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయకుండా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువత భవిష్యత్తుతో మోడీ సర్కారు ఆటలాడుకుంటున్నది. వారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నది. గతేడాది పార్లమెంటు సమావేశాల్లో పలు సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారమే దీనిని స్పష్టం చేస్తున్నది. నిరుద్యోగ యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014 ఎన్నికల్లో మోడీ వాగ్దానం చేశారు. కానీ ఆ హామీని నిలబెట్టుకోవడంలో మాత్రం ప్రధానిగా మోడీ విఫలమయ్యారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్టానికి(6.1శాతానికి) చేరిందని 2017-18 నివేదికలో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(ఎన్ఎస్ఎస్ఓ) కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అస్తవ్యస్త విధానాలను దేశంలో ప్రవేశపెట్టి ప్రజల నడ్డి విరిచిన మోడీ.. దేశ ఆర్థిక వృద్ధి పెరిగిందని చెప్తున్నారు. కానీ, ఆర్థికవృద్ధికి తగ్గట్టుగా దేశంలో ఉద్యోగ కల్పన జరగలేదన్నది కాదనలేని సత్యం.
పట్టణ, గ్రామీణ పథకాలు-పడిపోయిన ఉపాధి కల్పన
దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పట్టణ, గ్రామీణ ఉపా ధి పథకాలను ప్రవేశపెట్టామని చెప్పుకుంటోంది. వీటిలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(పీఎంఈజీపీ), మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్), దీన్దయాళ్ గ్రామీణ్ కౌసల్య యోజన (డీడీయూ-జీకేవై), దీన్దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ (డీఏవై-ఎన్యూఎల్ఎం) వంటి పథకాలున్నాయి. కానీ, వీటితో యువతకు కలిగిన ప్రయోజనం అంత గొప్పగా ఏమీ లేదు. ఏటికేడు మాత్రం ఉద్యోగ, ఉపాధి కల్పన తగ్గిపోయిం ది. పీఎంఈజీపీ కింద 2017-18లో 3.87 లక్షల మందికి ఉపాధి కల్పన చేసినట్టు అంచనా ఉండగా అది కాస్తా 2018-19 నాటికి 2.85 లక్షలకు పడిపోయింది. డీడీయూ-జీకేవై కింద 2016-17లో 1.48 లక్షల మందికి ఉపాధి పొందినట్టు అంచనా. అయితే అది2017-18 ఏడాదిలో 76లక్షల మందికి(దాదాపు సగానికి పడిపోయింది) మాత్రమే ఉద్యోగాలు సాధించారు. ఇక డీఏవై-ఎన్యూఎంఎల్ కింద 2017-18లో 1.15 లక్షల మంది ఉపాధి పొందినట్టు సమారం ఉండగా అది 2018-19నాటికి 95వేలకు తగ్గింది.
భర్తీ కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు
కేంద్ర పరిధిలో వివిధ ఏజెన్సీలు తమ పరిధిలో ఉన్న ఉద్యోగ ఖాళీల నియామకాలను నత్తనడకన సాగిస్తున్నాయి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీలతో పాటు వివిధ మంత్రి త్వ శాఖలు తమ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీచేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. వివిధ శాఖలు, ఏజేన్సీల నుంచి అందిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యో గాల నియామకాలు 2016-17లో దాదాపు లక్ష పోస్టులు భర్తీ కాగా...2017-18 దాదాపు 70వేలకు తగ్గిపోవ డం(అంటే 30శాతం తగ్గుదల) గమనించాల్సిన అంశం.
ఇక నిరుద్యోగ యువతకు ఉద్యోగసమాచారం చేరాలనే ఉద్దేశంతో 2015లో కేంద్రం నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీఎస్) జాబ్ పోర్టల్ను ప్రారంభించింది. కానీ, ఉద్యోగ నియామకాల్లో ఖాళీలకు సంబంధించిన సమాచా రాన్ని అందించడంలో ఎన్సీఎస్ పోర్టల్ నిర్లక్ష్యంగా పనిచేస్తు న్నది. కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే పోస్ట్ చేయడంతో డిమాండ్ తగ్గ ఉద్యోగాలు భర్తీ కాకపోగా పరోక్షంగా నిరుద్యోగులు సమస్యను ఎదుర్కొంటు న్నారు. 2015-16లో 37 లక్షలకు పైగా ఉద్యోగార్థులకు గానూ కేవలం 1.48 లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. 2017-18లో 23 లక్షల మందికి పైగా ఉద్యోగార్థులకు గానూ కేవలం 9.21 లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి.నిరుద్యోగులకు ఉద్యోగ, స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు నైపుణ్యాభివృద్ధి పథకాలను నడుపుతున్నాయి. ఉదాహరణకు పీఎంకేవీవై కింద స్వల్పకాలిక దాదాపు 18.42 లక్షల మంది శిక్షణ పొందారు. కానీ, వారిలో కేవలం 10.10 లక్షల మంది మాత్రమే ఉద్యోగ, ఉపాధిని పొందగలిగారంటే పథకాల అమలుతీరు ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక కొన్ని మంత్రిత్వశాఖలు, విభాగాల కింద శిక్షణ పొందినవారిలో ఎంత మంది ఉపాధిని పొందగలిగారో చూస్తే.. ఫుడ్ ప్రాసెసింగ్లో 13.1శాతం, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ 38.4శాతం, గృహ, పట్టణ వ్యవహారాలు 43.6శాతం, ఎంఎస్ఎంఈ11.6శాతం, టూరిజం 7.5, భారీపరిశ్రమలలో 11.7 శాతం మంది మాత్రమే ఉద్యోగ, ఉపాధిని పొందారు.