Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రసంగాన్ని ముగించి.. ఆపై మౌనం
- మీడియా ప్రశ్నలు స్వీకరించని మోడీ
- ఫలితాలపై ఆందోళనా?.. మిత్రపక్షాల మెహర్బానీ కోసమా?
- మీడియా సమావేశంలో 'మన్ కీ బాత్' అంటూ విమర్శలు
న్యూఢిల్లీ : ఐదేండ్ల పాలనలో ప్రధాని మోడీ మొట్టమొదటిసారిగా మీడియా సమావేశంలో కనిపించారు. ఎన్నికల ప్రచారం ముగింపునకు ఒక గంట ముందు బీజేపీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సమావేశంలో మోడీ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చను లేవదీసింది. మొట్టమొదటిసారిగా పాల్గొన్న మీడియా సమావేశంలోనూ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు మోడీ నిరాకరించారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. విలేకరులు అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానమిస్తారని దాటవేయడంపై అసంతృప్తి వ్యక్తమైంది. అమిత్ షా సమాధానాలిస్తుండగా.. పక్కనే ఉన్న మోడీ దాదాపు 17 నిమిషాలు మౌనంగానే ఉన్నారు. అయితే విలేకరుల ప్రశ్నలను నిరాకరించిన మోడీలో ఆత్మస్థైర్యం సన్నగిల్లిందనీ, ఫలితాలపై ఆందోళన మొదలైందన్న విశ్లేషణలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు అక్షరు కుమార్ చేసిన ఇంటర్వ్యూలో మోడీ చారు తాగుతూ నింపాదిగా సమాధానాలిచ్చారు. మీరు పీఎం కావాలని ఎప్పుడైన కోరుకున్నారా? మీకు జలుబు అయితే ఏం చేస్తారు? లాంటి సులువైన ప్రశ్నలకు మాత్రమే మోడీ సమాధానాలిస్తారని, లేదా ముందస్తుగా సిద్ధం చేసిన ప్రశ్నలకు మాత్రమే జవాబు చెబుతారన్న పలువురు విమర్శిస్తున్నారు. అందుకే జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ముందుకురాలేరన్న చర్చ నడుస్తున్నది.
ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నికల క్యాంపెయిన్ గురించి ప్రసంగించిన మోడీ అటు తర్వాత మౌన ముద్ర దాల్చారు. ఎప్పటిలాగే తన మన్ కీ బాత్కే పరిమితమయ్యారు. కాగా, మీడియా ప్రతినిధులు తమ ప్రశ్న ప్రధానికంటూ నేరుగా అడిగినా.. వాటికి సమాధానం ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడే జవాబు చెబుతారని గమ్మున ఉండటం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. పార్టీ అధ్యక్షుడే సర్వమనీ, తాము పార్టీ సైనికులమని పేర్కొంటూ ఆయన విలేకరుల ప్రశ్నలను దాటవేసి అమిత్ షాకు బదిలీ చేశారు.
అయితే ఈ చర్యతో ప్రధాని తాను పార్టీ విధేయుడేనని చెప్పుకునే ప్రయత్నం చేశారని విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై మోడీ గుండెల్లో గుబులు మొదలైందనీ, తాము ఆశించిన ఫలితాలు రావన్న కలవరంలో ఆయన ఉన్నారని తెలుస్తున్నది. ఫలితాలనంతరం మిత్రపక్షాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందన్న అవగాహనకు మోడీ వచ్చారన్న విషయాన్ని ఆయన తీరు వెల్లడిస్తున్నది. లేదంటే పార్టీ సీనియర్లను లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకున్న మోడీ ఇప్పుడు పార్టీ విధేయుడినని నిరూపించుకునే ప్రయత్నం ఎందుకన్న చర్చ నడుస్తున్నది. మిత్రపక్షాల్లోనూ మోడీపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలోనే ఈ సంకేతాన్ని ఇవ్వదలిచారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఫలితాల విడుదలకు ముందే నాగ్పూర్లోని ఆరెస్సెస్ హెడక్వార్టర్కు వెళ్లి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్తో భేటీ కానున్నట్టు వస్తున్న వార్తలు ఈ అభిప్రాయాలను మరింత బలపరుస్తున్నాయి. మోడీపై అంతర్గతంగా ఆరెస్సెస్ శ్రేణుల్లో ఆగ్రహం నెలకొంది. అందుకే గడ్కరీనీ ఇటీవలే హైలైట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆరెస్సెస్ 'ఆశీర్వాదం' కోసం ఈ పర్యటన చేస్తున్నారని సమాచారం. అదీగాక, మబ్బులో రాడార్ పని చేయదని తన స్వీయ తర్కాన్ని ప్రదర్శించి, డిజిటల్ కెమెరాలేని రోజుల్లోనే తాను ఆ కెమెరా వాడినట్టు, ఇంటర్నెట్ సౌకర్యంలేనిరోజుల్లో మెయిల్ చేసినట్టు గొప్పలు చెప్పుకోబోయి విమర్శలపాలైన విషయం తెలిసిందే.