Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాంబులతో తృణమూల్ అరాచకాలు
- ప్రశాంతంగా జరిగేందుకు క్రిమినల్స్ను అరెస్టు చేయాలి
- ప్రజల్లో నమ్మకం కల్పిస్తూ.. కేంద్ర బలగాలను దించాలి : ఈసీకి ఏచూరి వినతి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికలు చివరి దశలో పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. శనివారం సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు హన్నన్ మెల్లాతో కలిసి ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను ఏచూరి కలిశారు. అనంతరం ఈసీ కార్యాలయం ఆవరణలో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ తృణమూల్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు బాంబులతో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని,తమ పార్టీ అభ్యర్థులైన ఫూవద్ హలీం వాహనంపై దాడి చేసేందుకు పలుమార్లు యత్నించారని అన్నారు. ఫూవద్ హలీంకి రక్షణ కల్పించాలన్నారు. ఈ అంశంపై తాము స్థానిక అధికారులను కలిసినప్పటికీ, చర్యలు తీసుకున్న దాఖలాల్లేవన్నారు. తమ పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను, మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం స్వేఛ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
గత ఆరు దశల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని... అప్పుడు కూడా తమ పార్టీ హెచ్చరించినా ఈసీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయలేదని అన్నారు. అందువల్లే బెంగాల్లో హింస చెలరేగుతున్నదని వివరించారు. డైమండ్ హర్బర్, జాదవ్పూర్ నియోజకవర్గాలకు సంబంధించి తాము 10 లేఖలు అందజేశామన్నారు. ఒక్క దానికి కూడా ఈసీ నుంచి సమాధానం రాలేదని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగవని అన్నారు. ఎన్నిక జరుగుతున్నంత సేపు ఛార్జీషీట్ నమోదైన క్రిమినల్స్ని అదుపులోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై తమకు గతంలో ఈసీ హామీ ఇచ్చిందని అన్నారు. అయితే, క్షేత్ర స్థాయిలో మాత్రం హామీ అమలు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించాలని కోరారు. రాష్ట్ర పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించాలని విన్నవించారు. సాధారణ ఓటర్లలో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో ఎన్నికల ప్రక్రియ హింసాత్మకం అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. తృణమూల్, బీజేపీ పోటాపోటీగా హింసను ప్రేరేపిస్తూ సామాన్య ప్రజానీకాన్ని భయానికి గురి చేస్తున్నాయని అన్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 630 బూత్లతో రీపోలింగ్ నిర్వహించాలని అన్నారు. ఎన్నికల సంఘంలో కమిషనర్ అనీల్ లావస అసమ్మతి నోట్పై ఇన్ని రోజులు బహిర్గతం కాకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఎన్నికల తర్వాతే ఉంటుందని వెల్లడించారు.