Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ, అమిత్షాల కోడ్ ఉల్లంఘనలపై క్లీన్ చిట్ ఇవ్వడానికి సమ్మతించని ఓ సభ్యుడు
- తన అసమ్మతిని వెల్లడించనందుకు నిరసనగా సమావేశాలను బహిష్కరిస్తున్న అశోక్ లవాసా
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సభ్యుల మధ్య ఆయా నిర్ణయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన విషయం బహిర్గతమైంది. ముఖ్యంగా ఆయా పార్టీల నేతలు తమ ఎన్నికల ప్రచారంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఈసీఐలోని ముగ్గురు సభ్యుల్లో ఒకరైన అశోక్ లవాసా తన అసమ్మతి నోట్ను ఫిర్యాదిదారులకు తెలియజేయక పోవడాన్ని నిరసిస్తూ ఎన్నికల కోడ్పై నిర్ణయాలు తీసుకునే సమావేశాలకు గైర్హాజరవుతున్నట్టు తెలుస్తోంది.
ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన కనీసం ఐదు కేసుల్లో ఈసీఐలోని మిగతా ఇద్దరు సభ్యుల నిర్ణయానికి భిన్నంగా తన అసమ్మతి నోట్ను ఇచ్చినట్టు ఆయన అనుయాయులు చెబుతున్నారు. ఈ కేసులు రెండింటిలో ఈసీఐ 2:1 మెజారిటీ నిర్ణయంతో బీజేపీ నేతలకు క్లీన్చిట్ ఇవ్వడం గమనార్హం. అయితే, ఫిర్యాదిదారులకు తన అసమ్మతి నోట్ను పేర్కొనకుండా కేవలం కోడ్ ఉల్లంఘన జరగలేదని నిర్ణయించిన విషయాన్ని మాత్రమే ఈసీఐ తెలియజేయడాన్ని లవాసా తప్పు పట్టారు. దీనిపై ఈ నెల 4న చీఫ్ ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరాకు లేఖ వ్రాశారు. ఈసీఐ నుంచి ఇచ్చే తుది ఆదేశాల్లో తన అసమ్మతిని కూడా పేర్కొనాలని లేఖలో గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించకపోవడంతో నిరసనగా కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై నిర్వహించే సమావేశాలకు తాను హాజరు కాలేనని లవాసా మరో నోట్ను సీఈసీ అరోరాకు ఇచ్చినట్టు తెలుస్తోంది.
మీడియాలో వచ్చిన వార్తపై సీఈసీ సునీల్ అరోరా స్పందించారు. ఎన్నికల కమిషన్లోని సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు కొత్తేమీ కాదని, గతంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయని అరోరా అన్నారు. ఈసీఐలోని ముగ్గురు సభ్యుల అభిప్రాయాలు క్లోనింగ్(సారూప్య జీవులను సృష్టించే ప్రక్రియ) చేసినట్టు ఒకే విధంగా ఉండాలని ఏమీ లేదని అరోరా అన్నారు. పదవిలో ఉండగా తాము వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాల గురించి పదవీ విరమణ తర్వాత వ్రాసిన పుస్తకాల్లో సీఈసీలు, ఈసీలు వెల్లడించిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు.