Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ
- సార్వత్రిక ఎన్నికలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం
న్యూఢిల్లీ:భారత పెట్టుబడుల మార్కెట్ నుంచి విదేశీ మదుపర్లు మే నెలలో ఇప్పటివరకూ రూ.6,399 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించారు. అమిరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం, మన దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడినట్టు భావిస్తున్నారు. మే 2 నుంచి 17 వరకు విదేశీ మదుపర్లు(ఎఫ్పీఐలు) ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.4786.38 కోట్లు, డెబిట్ మార్కెట్ నుంచి రూ. రూ.1612.62 కోట్లు ఉపసంహరించారు. ఉపసంహరణల మొత్తం రూ.6399 కోట్లు.
ఇందుకు భిన్నంగా విదేశీ మదుపర్లు దేశీయ మార్కెట్లలోకి గడిచిన మూడు నెలల్లో(ఫిబ్రవరి,మార్చి,ఏప్రిల్) వరుసగా రూ.11,182 కోట్లు, రూ.45,981 కోట్లు, రూ.16,093 కోట్ల చొప్పున పెట్టుబడులు చొప్పించారు. ఈ ట్రెండ్ మే నెలలో రివర్స్ కావడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల వేళ విదేశీ మదుపర్లు తదుపరి ఏర్పడబోయే ప్రభుత్వం పట్ల వేచి చూసే ధోరణి తీసుకోవడమే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం భారత ఈక్విటీ మార్కెట్లోకి పెట్టుబడుల రాకకు ప్రతికూలంగా మారిందని నిపుణులు విశ్లేషించారు. ట్రెండ్లో ఈ మార్పు పూర్తిగా అంచనాలకు అందనిదేమీ కాదు, దేశీయంగానూ, ప్రపంచంలోనూ ప్రతికూలత కనిపిస్తోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోవడం పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురి చేసిందని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ హిమాన్ష్ శ్రీవాస్తవ అన్నారు.