Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి దశలోనూ బెంగాల్లో హింస
- పంజాబ్లో ఘర్షణలు, పలుచోట్ల ఈవీఎంల మొరాయింపులు
- ఏడవ విడతలో 62.87 శాతం పోలింగ్
న్యూఢిల్లీ :
ఏడు దశల్లో జరిగిన సార్వత్రికానికి తెరపడింది. 39 రోజుల పాటు కొనసాగిన ఈ ఎన్నికల ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. గతంలో ఏ ప్రధాని చేయనన్నీ కోడ్ ఉల్లంఘనలు చేశారనీ ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా...మోడీకి ఎనిమిదిసార్లు క్లీన్ చిట్ ఇచ్చింది. లోక్సభకు జరిగిన ఎన్నికల్లో వేలకోట్ల నగదు కట్టలు పారాయి. మద్యం ఏరులైంది. ఎన్నడూలేని విధంగా డ్రగ్స్ కూడా ఓటర్లకు ఇచ్చి..తమకు అనుకూలంగా మలుచుకోవటంలో పార్టీలు తెగబడ్డాయి.. పశ్చిమబెంగాల్ తో పాటు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. పోలింగ్ కేంద్రాలను వశపర్చుకుని రిగ్గింగులు,దౌర్జన్యకర ఘటనలతో రక్తం పారింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కావని మేధావి వర్గాలు వాపోయారు. సార్వత్రికం ముగిశాక..ఇపుడు అందరి దృష్టి ఎగ్టిట్పోల్స్ వైపు పడింది. ఇవి ఎంత వరకు నిఖార్సుగా ఉంటాయో..23 వరకు వేచిచూడాల్సిందే.
దాదాపు నలభై రోజుల పాటు హౌరాహౌరిగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ఆదివారం జరిగిన చివరి దశ పోలింగ్తో ముగిసింది. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యానికి జరిగిన ఈ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించడానికి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లతో పాటు పలువురు ప్రాంతీయ పార్టీల నాయకులూ పోటీపడుతున్నారు. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గానూ 542 నియోజకవర్గాలలో ఎన్నికలు ముగిశాయి. తమిళనాడులోని వేలూరులో ఎన్నికలు రద్దైన విషయం తెలిసిందే. కాగా ఏడు దశలలో భాగంగా.. చివరి దఫా ఎన్నికలు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాలలో ఆదివారం జరిగాయి. తొలి దశ నుంచీ జరుగుతున్నట్టుగానే బెంగాల్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పంజాబ్లోనూ పలుచోట్ల హింస చెలరేగింది. మధ్యప్రదేశ్, బీహార్, యూపీలలో పలుచోట్ల ఈవీఎంలు మొరా యించడం మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల కమిషన్ (ఈసీ) తెలిపింది. చివరి దశ ఎన్నికలలో మొత్తంగా 62.87 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది. సార్వత్రిక ఫలితాలు ఈనెల 23న విడుదల కానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెల కొన్నది. ఆరు దశల మాదిరిగానే బెంగాల్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దఫాలో ఇక్కడ తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ), బీజేపీల కార్యకర్తలు పలుచోట్ల బాహాబాహీకి దిగారు. ఉత్తర కోల్కత, దక్షిణ కోల్కతలలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. శనివారం రాత్రి రాజర్హట్లోని బీజేపీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. మధురాపూర్ లోక్సభ పరిధిలోని రైడిఘి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల నాటుబాంబులు విసిరినట్టు పోలీసులు తెలిపారు. బీజేపీ జాదవ్పూర్ అభ్యర్థి అనుపమ్ హజ్రా కారును టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తమ పోలింగ్ ఏజెంట్లపై దాడి చేసి తమను పోలింగ్ బూత్ నుంచి బయిటకు పంపించారని సీపీఐ(ఎం) కోల్కతా నార్త్ అభ్యర్థి కొనినికా రోడ్డుపై బైటాయించారు.
బెంగాల్తో పాటు పంజాబ్లోనూ పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బతిందా, ఖదూర్ సాహిబ్, ఫిరోజ్పూర్ పార్లమెంటరీ పరిధిలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఖదూర్ సాహిబ్లోని హర్దో సరిల్ గ్రామంలో ఓటు వేయడానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. రాంపురలో అకాళీదల్ కార్యకర్తలు చేసిన దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బతిందాలో శిరోమణి అకాళీదళ్ (ఎస్ఏడీ), కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పలువురు దుండగులు ఫైరింగ్కు దిగడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్టు సమాచారం. దీంతో అక్కడ అధికారులు కొంతసేపు పోలింగ్ను నిలిపేశారు. హొషియార్పుర్ నియోజకవర్గంలోనూ అల్లర్లు చోటుచేసుకున్నాయి.
బీహార్, మధ్యప్రదేశ్, యూపీలలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. యూపీలోని చందోళి పరిధిలో ఉన్న తారాజీవన్పూర్ గ్రామస్థులు స్థానికాధికారుల తీరుపై మండిపడ్డారు. ఇక్కడ కొందరు బీజేపీ కార్యకర్తలు తమ గ్రామంలో ఉన్న పలువురు ఓటర్ల చేతివేళ్లపై సిరా గుర్తు రాసి.. వారికి రూ.500 ఇచ్చి ఓటేయొద్దంటూ బెదిరించారని ఆరోపించారు. అంతేగాక పోలింగ్ కేంద్రాలకు రావొద్దని.. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దనీ తమను బెదిరించినట్టు గామస్థులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని మాల్వా జిల్లాలో గల ఆరు పోలింగ్ బూత్ల పరిధిలోని ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు.