Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూటమిపై సమాలోచనలు
- ప్రస్తుత భేటీలన్నీ మర్యాదపూర్వకమైనవే : ఏచూరి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే బీజేపీ, ఎన్డీయేతర కూటమి ఏర్పాటుపై సమాలోచనలు చేస్తామని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పునరుద్ఘాటించారు. అయితే, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు జరుపుతున్న భేటీలన్నీ కేవలం మర్యాదపూర్వకమైనవని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఏచూరి, ఏపీ సీఎం చంద్రబాబుతో ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో సమావేశం అయ్యారు. సుమారు గంట పాటు ఇరువురు నాయకులు తాజా రాజకీయ పరిస్థితులపై మంతనాలు జరిపారు. సమావేశం తర్వాత ఏచూరి మీడియాతో మాట్లాడుతూ... బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలేవీ? అనే అంశంపై ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత మద్దతిచ్చే పార్టీల్లో కూడా మార్పులు ఉంటాయనీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశంపై కూటమి ఏర్పాటు ఆధారపడి ఉంటుందని చెప్పారు. అయితే, 23వ తేదీన ప్రతిపక్ష పార్టీల సమావేశం గురించి ఇంకా స్పష్టత రాలేదని ఏచూరి వెల్లడించారు. ఎన్నికల ముందు బీజేపీ అవినీతి, అక్రమాలపై పలు అంశాల ప్రాతిపదికన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పని చేశామనీ.. అదే స్నేహంతో తాము ప్రస్తుతం కలుస్తున్నామని అన్నారు. ఇదే సమైక్య స్పూర్తిని కొనసాగించేందుకు అవసరమైన వ్యూహాలతో ముందుకు వెళతామని అన్నారు. కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయం కూడా ఫలితాల తర్వాతే వెల్లడిస్తామన్నారు. ఇప్పటివరకైతే ఎటువంటి సంప్రదింపులు జరగడం లేదన్నారు. తమ కూటమి ఎజెండా కూడా ప్రకటిస్తామన్నారు.