Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల కమిషన్ సభ్యుల మధ్య విభేదాలెన్నో...
- టిఎన్ శేషన్ సమయంలోనూ సుప్రీంకోర్టు తలుపు తట్టిన వివాదం
- 1995 తీర్పులో ఏం చెప్పారు,.?
న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇంకా ఒకరోజు సమయం మాత్రమే ఉన్నది. ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించిన ఎన్నికల కమిషన్ తీరుపై మాత్రం ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నది. కోర్టులు కూడా ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోవడానికి ఏమంత ఆసక్తి చూపడంలేదు..? ప్రతి లోక్సభ పరిధిలోనూ కనీసం 50 శాతం పోలింగ్ బూత్ల్లోనైనా వీవీప్యాట్ చీటీలను లెక్కించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన 22 రాజకీయ పార్టీలకు నిరాశే ఎదురైంది. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 5 పోలింగ్ బూత్లకే వీవీప్యాట్ చీటీల లెక్కింపును పరిమితం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఐదు బూత్ల్లో తేడాలొస్తే ఏం చేయాలన్నదానిపై ఎటువంటి ఆదేశాలనూ సుప్రీంకోర్టు ఇవ్వలేదు. దాంతో, వీవీప్యాట్ల లెక్కింపు కోరుతున్న రాజకీయ పార్టీలు అయోమయానికి గురయ్యాయి. ఇప్పుడు మరోసారి ఎన్నికల కమిషన్ను వీవీప్యాట్ల లెక్కింపుపై వివరణ కోరాయి. తేడా వస్తే ఆ అసెంబ్లీ పరిధిలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనని డిమాండ్ చేశాయి. దీనిపై ఎన్నికల కమిషన్ నుంచి నిర్ణయం రావాల్సి ఉన్నది.
మరోవైపు ఎన్నికల కమిషన్లోని ముగ్గురు సభ్యుల్లో ఇద్దరి నిర్ణయాలు అమలులోకి వస్తున్న తీరు. ఆయా పార్టీల నేతల ఎన్నికల ప్రచారం సందర్భంగా కోడ్ ఉల్లంఘనలపై విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షాలపై కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులు రాగా, వారిద్దరికీ ఎన్నికల కమిషన్ 2:1 మెజారిటీతో క్లీన్చిట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. మిగతా ఇద్దరు సభ్యుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి నోట్ ఇచ్చిన ఎన్నికల కమిషనర్ అశోక్లవాసా, తన అభిప్రాయాన్ని రికార్డ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇకముందు కోడ్ ఉల్లంఘనలపై జరిగే సమావేశాలకు హాజరు కాబోనంటూ సీఈసీ సునీల్అరోరాకు లేఖ వ్రాశారు. ఈ వివాదం మీడియాకు లీక్ కావడంతో కమిషన్ విధులు, బాధ్యతలపై మరోసారి చర్చ జరుగుతోంది. కమిషన్ తీసుకునే తుది నిర్ణయాల్లో అసమ్మతి నోట్ను పేర్నొనాల్సిన అవసరమేమీ లేదంటూ సునీల్ అరోరా తేల్చి చెప్పారు. దీంతో, ఎన్నికల కమిషన్కుండే అధికారాలు, విధులు పరిపాలనాపరమైనవా..? న్యాయ వ్యవస్థ(కోర్టుల)లాంటివా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కోర్టు తీర్పుల విషయం తెలిసిందే. ఒక ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులుంటే, ఇద్దరితో ఒకరు విభేదించినపుడు మెజారిటీ నిర్ణయాన్ని తీర్పుగా పరిగణిస్తారు. అయితే, మైనారిటీ తీర్పును కూడా బహిర్గతం చేస్తారు. కోర్టులు పాటించే ఈ పారదర్శక సూత్రం ఎన్నికల కమిషన్కు ఎందుకు వర్తించదు అన్నది ప్రశ్న. ఓవేళ ఎన్నికల కమిషన్ పరిపాలనా విభాగమే అనుకున్నా పారదర్శకత పాటించాల్సిన అవసరం లేదా..? కోడ్ ఉల్లంఘనలపై న్యాయస్థానాల్లా తీర్పులు ఇచ్చి అమలు చేస్తున్నందున ఎన్నికల కమిషన్ విధులు అర్థ న్యాయవ్యవస్థను పోలి ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుత భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)లో చీఫ్ ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లున్నారు. చీఫ్ ఎన్నికల కమిషనర్ను తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతినే అనుసరించాలి. పార్లమెంట్లోని ఉభయసభల్లో మహా అభియోగ తీర్మానాన్ని ఆమోదింపజేయడం ద్వారా అది జరగాలి. కానీ, మిగతా ఇద్దరు కమిషనర్లను సీఈసీ సిఫారసు ద్వారా తొలగించే వీలున్నది.
టిఎన్ శేషన్ సీఈసీగా ఉన్న సమయంలో(1990-96) ఎన్నికల కమిషన్ పనితీరును పలువురు అభినందించారు. కోడ్ను నిష్పాక్షికంగా అమలు చేయడంతోపాటు రిగ్గింగ్ను అదుపు చేయడంలో చురుగ్గా వ్యవహరించారన్న పేరు శేషన్కున్నది. శేషన్ బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలో ఈసీఐలో సీఈసీ ఒక్కరే ఉండేవారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పివి నర్సింహారావు ప్రభుత్వం మరో ఇద్దరు కమిషనర్లను నియమించింది. దాంతో, ఇది తనను అదుపు చేసేందుకేనని భావించిన శేషన్ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు(1995,జులై 14) ఈసీఐలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించడాన్ని సమర్థించింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగపరంగా సీఈసీకి మిగతాసభ్యులకన్నా ఎక్కువ రక్షణ ఉండటం, సమావేశాలకు అధ్యక్షత వహించే అధికారం ఉన్నంత మాత్రాన మిగతావారికన్నా తాను అధికుడినని భావించరాదు. అంటే నిర్ణయాల్లో ముగ్గురు సభ్యులకూ సమాన అధికారాలుంటాయి. అయితే, కమిషన్ సభ్యుల నిర్ణయాల్లో తేడాలొచ్చినపుడు ఏవిధంగా పరిష్కరించుకోవాలన్నదానిపై సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టమైన మార్గదర్శకాలు సూచించలేదు.
ఇదిలా ఉండగా ఆ సందర్భంగా టిఎన్ శేషన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకే పోలీస్ స్టేషన్లో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లుంటే ఎలా ఉంటుంది..? సమాన అధికారాలున్న ముగ్గురి మధ్యా నిర్ణయాల్లో తేడాలొస్తే ఎలా..? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రతిష్టంభన ఏర్పడితే విధులకు ఆటంకమని ఆయన ఆ సందర్భంగా వాదించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తగినంత పనిలేక ఖాళీగా కూర్చుంటున్నానన్నారు. ఆయన ఉద్దేశం ఈసీఐకి ముగ్గురు కమిషనర్ల అవసరం లేదన్నదే. ముగ్గురి వల్ల పని మెరుగవుతుందంటే, రేపు మరొకరు ఐదుగురి వల్ల మరింత మెరుగవుతుందంటారు. దీనికి అంతం ఉండదు అంటూ శేషన్ తన వాదన తాను వినిపించారు.