Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫాం 17 ఓటర్లు... ఈవీఎంలోనివి తేడా వస్తే
ఏం చేస్తారని నిలదీత
- తేడా ఉంటే పూర్తిగా వీవీప్యాట్లు కౌంట్ చేశాక ఫలితాలు ఇవ్వాలి
- కోరిన చోట రీపోలింగ్ ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తి
- అవకతవకలపై పవర్పాయింట్ ప్రజేంటేషన్తో వివరించిన నేతలు
- అన్ని ప్రశ్నలకూ ఈసీ సమాధానం దాటవేత
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్షాలు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటూ ఐక్యరాగం వినిపించాయి. ఇటీవల ముగిసిన జనరల్ ఎలక్షన్స్లో చోటు చేసుకున్న పరిణామాలు, ఫలితాల్లో ఏర్పడే ఇబ్బందులను తొలగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచేందుకు కషి చేస్తున్నాయి. ఈ మేరకు తమకు అనుమానాలతో ఈసీపై 22 పార్టీల నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. గత కొన్ని ఎన్నికల నుంచి ఆయా రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంతో జరిగిన అవకతవకలు, సాంకేతిక సమస్యలు, ట్యాంపరింగ్ వంటి సమస్యలపై విపక్షాలు ఒక పవర్ పాయింట్ ప్రజేంటేషన్ను రూపొందించి ఈసీ ముగ్గురి కమిషనర్లు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులకు చూపించారు. అనంతరం పార్టీలవారీగా ఆయా నేతలు ఎన్నికల సంఘం కమిషనర్లను ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే, ఈ భేటీలో ప్రధానంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్జేడీ నేత మనోజ్ ఝా అధికంగా ప్రశ్నలు అడిగారు. ఏపీలో తాము అడిగిన చోట రీపోలింగ్ నిర్వహించ లేదని... అదే తమ ప్రతిపక్ష పార్టీ అయిన వైపీసీ పోలింగ్ జరిగిన నెల తర్వాత ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్నారని అదెక్కడి న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, దీనికి ఈసీ నుంచి రూల్ ప్రకారమే చేసినట్టు సమాధానం వచ్చింది. ఫాం 17 ప్రకారం నమోదైన ఓట్లు, ఈవీఎంలో పోలైన ఓట్లతో సరితూగని పక్షంలో ఎటువంటి చర్యలు చేపడుతారని చంద్రబాబు ప్రశ్నించగా.... అటు పరిస్థితి ఉత్పన్నం కాదని సునీల్ అరోరా సమాధానమిచ్చినట్టు తెలిసింది. ఫాం 17లోని ఓటర్లు, ఈవీఎంలో పోలైన ఓట్ల ప్రకారమే అవుతాయని ఆయన చెప్పారు. దీనిపై ఎటువంటి అనుమానం అక్కర్లేదని... అటువంటి సందర్భం ఉత్పన్నం అయితే పూర్తి వీవీప్యాట్లు లెక్కించి తేడా ఆ నియోజకవర్గ ఫలితాలు వెల్లడించడటం ఆపుతామని చెప్పారని అన్నారు. అయితే, ఎన్నికల సంఘం గతంలో తమకు చాలా హామీలు ఇచ్చిందని ఆచరణలో మాత్రం అవేవి అమలుకు నోచుకోలేదని సీతారాం ఎదురు ప్రశ్నించగా... సీఈసీ కొట్టిపారేసినట్టు తెలిసింది. అటువంటిదేమి లేదని ఫిర్యాదు వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ చేపట్టామని, ఫిర్యాదులోని వాస్తవాలు సంబంధిత అధికార యంత్రాంగం ద్వారా నిర్ధారించబడితే చర్యలు తీసుకున్నామని సీఈసీ బదులు ఇచ్చినట్టు సమాచారం. ఫలితాల లెక్కింపు రోజున ఈవీఎంలో తేడా వస్తే... ఆయా పార్టీల అభ్యర్థుల సమక్షంలోనే వీవీప్యాట్లను లెక్కించాలని కోరగా ఈసీ సమ్మతించినట్టు చెప్పారు. అయితే, ఫలితాల లెక్కింపు, ప్రకటించడం వంటి కీలక విషయాల్లో ఎన్నికల విధులు ఏ అధికారులైతే నిర్వర్తించారో వారినే కొనసాగించాలని ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశం ఇవ్వాలని ఏచూరి సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఆర్ఓలను కౌంటింగ్ సమయంలో మార్చితే తప్పక అవకతవకలు చోటు చేసుకుంటాయని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంపై ఈసీ స్పందిస్తూ.... కొన్ని అనివార్యత పరిస్థితుల్లోనే కొంతమంది ఆర్ఓలను మాత్రమే మార్చినట్టు చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఇబ్బందికరమ పరిస్థితులు ఏర్పడే ప్రదేశాల్లో ఎక్కడా మార్చలేదని అన్నారు. వెస్ట్ త్రిపురకు సంబంధించిన ఆర్ఓను మార్చిన ఉదంతాన్ని ఏచూరి సునీల్ అరోరా దృష్టికి తీసుకురాగా, అక్కడి అంశం పరిశీలిస్తున్నామని ఎన్నికల ఫలితాల ముందు రోజు వరకు ఈ విషయంపై పూర్తి మేర స్పష్టత వస్తుందని ఈసీ వివరించినట్టు తెలిసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5 వీవీప్యాట్లు లెక్కించాలని ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయంపై మరోసారి ఈసీ కమిషనర్ల దగ్గర ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ సందర్భంలో పూర్తిగా లెక్కించడం ఆలస్యం అవుతున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ విషయంపై చంద్రబాబు కలగజేసుకుంటూ... కనీసం ఈ అంశంపై ఈసీ ఒక కమిటీ వేసి సాంకేతికంగా నిరూపించి తమ వాదనను తిరస్కరించాలని అడిగినట్టు సమాచారం. ఎటువంటి విచారణ చేయకుండా కేవలం లేటు అవుతుందన్న ఒకే ఒక్క వ్యాక్యం చెప్పి కోర్టు ద్వారా తమ వాదనకు చెక్ చెప్పించారని వ్యాఖ్యానించారు. అయితే, ఈ విషయంపై ప్రతిపక్షాల మద్ధతు కూడగట్టి పోరాడుతామని సునీల్ అరోరాతో చెప్పినట్టు చెప్పారు. మాజీ ఎన్నికల కమిషనర్లు నవీన్ చావ్లా, ఎస్వై ఖురేషిలు కూడా పూర్తిగా లెక్కించాలని అడుగుతున్నారని... తాము మాత్రం కేవలం 50 శాతం లెక్కించాలని అడుగుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రశ్నకు ఈసీ స్పందిస్తూ.... తాము ప్రతిపక్ష పార్టీలతో గత ఐదు సంవత్సారల్లో 90కి పైగా సమావేశాలు నిర్వహించామని అన్నారు. ఆ సమయంలో ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలన్నీ పెద్ద లేవనెత్తలేదని చెప్పినట్టు భోగట్ట. టెక్నికల్గా అది సాధ్యం కాదన్నారు. కాగా, ఈవీఎంల భద్రతపై ఏ రాజకీయ పార్టీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాము వాటిని స్రాంగ్ రూంలో ఉంచినట్టు, ఎప్పటికప్పుడూ భద్రత పరంగా తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తున్నట్టు తెలిపారు.