Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంచనాలు తలకిందులైన సర్వేలు
న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్న అంశంపై చర్చోపచర్చలు కొనసాగాయి. అయితే 19వ తేదీ సాయంత్రం చివరిదశ పోలింగ్ ముగిసిన వెంటనే వెలుగు చూసిన ఎగ్జిట్ పోల్స్తో ఈ చర్చలకు తెరపడింది. ఒకటి కాదు... రెండు కాదు... ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన దాదాపు అన్ని సంస్థలూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని తమ అంచనాల్లో తేల్చిచెప్పాయి. అయితే ఈ అంచనాలు ఎంతవరకూ నిజమవుతాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. గత ఎన్నికల్లో వెలువరించిన ఎగ్జిట్పోల్స్ను, ప్రస్తుత ఎగ్జిట్పోల్స్ను, వాస్తవాలను పరిశీలిస్తే ఎన్నికల ఫలితాలు భిన్నమైన రీతిలో వెలువడనున్నాయని చెప్పక తప్పదు. గతంలో వెలువరించిన పాడ్కాస్ట్(ఎగ్జిట్పోల్స్)ను పరిగణనలోకి తీసుకుని పార్లమెంట్లో దాదాపు 120 స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్, యూపీల ఎన్నికల తీరును పరిశీలిస్తే...
బీహార్...
జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ స్వస్థలం... ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని కూటమికి ఘన విజయం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఎన్డీయే కూటమికి రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలూ లభిస్తాయన్న ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా అంచనాలను పరిశీలిస్తే కాంగ్రెస్తో కూడిన లాలూ నేతృత్వంలోని కూటమి మట్టికరిచినట్టేనని భావించవచ్చు. కానీ గత చరిత్రను చూస్తే ఈ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అధికశాతం తప్పయిన సందర్భాలే ఎక్కువగా కన్పిస్తాయి. 2015 నాటి అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే అప్పట్లో ఎగ్జిట్పోల్స్ అన్నీ బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెట్టాయి. వాస్తవానికి అనేక సంస్థలు మొత్తం 234 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ కూటమికి 155 స్థానాలు లభించవచ్చని అంచనా వేశాయి. వాస్తవ ఫలితాలు ఈ అంచనాలకు విరుద్ధంగా వెలువడ్డాయి. లాలూ నేతృత్వంలోని మహాకూటమికి 180 వరకూ స్థానాలు లభించాయి. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ తన సొంతంగా 44 శాతం ఓటింగ్తో 80 స్థానాలను సాధించి విజయఢంకా మోగించింది. తరువాత నితీష్ మహాకూటమి నుంచి విడిపోయి ఇప్పుడు ఎన్డీయే భాగస్వామిగా ఉన్నారు. కాగా మహాకూటమిలో ఉపేంద్ర ఖుష్వాహాకు చెందిన ఆర్ఎల్ఎస్పీ, జితన్రాం మాంఝికి చెందిన హెచ్ఎఎం, ముఖేష్ సాహ్నీకి చెందిన వీఐపీ వంటి కొత్త పార్టీలు భాగస్వాములయ్యాయి. ఈ కొత్త పార్టీలకు పెద్దగా బలం లేనప్పటికీ ఇవి అత్యంత వెనుకబడిన వర్గా (ఎంబీసీ)లకు, మహా దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్న పేరు తెచ్చుకున్నాయి. మహాకూటమి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసిన కిషన్గంజ్, కతిహార్, పూర్నియా, అరారియా, భాగల్పూర్, బంకా, బక్సార్, సితామరి, పాటలీపుత్ర, సివాన్, నవాడా వంటి స్థానాల్లో ఈ పార్టీలు ప్రయోజనం పొందే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానాలన్నీ మోడీ వేవ్లో బీజేపీ ఖాతాలో చేరిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ 40 శాతం మేర ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకు మహాకూటమికి చెక్కుచెదరని పునాదిగా నిలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఎన్డీయే విజయంపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీహార్లో తలకిందులయ్యే అవకాశాలు లేకపోలేదన్న విషయం స్పష్టమవుతోంది.
యూపీలో మహాకూటమికి ఎదురునిలుస్తుందా?
భారత్కు గుండెకాయ వంటి యూపీలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు భిన్నమైన అంచనాలను వెలువరించాయి. ఒకటి ఎన్డీయే క్లీన్స్వీప్ చేసి బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మరో ఎగ్జిట్ పోల్లో మహాకూటమి స్వీప్ చేస్తుందని అంచనా వెలువడింది. మరికొన్ని అంచనాలలో బీజేపీ లేదా కాంగ్రెస్కు మెజార్టీ దక్కదనీ, ఇతరులు (సమాజ్వాది, బీఎస్పీ)లు విజయం సాధిస్తారని చెప్పాయి. అయితే కొన్ని అంచనాలు మాత్రం ఎన్డీయే, మహాకూటమి మధ్య భారీగా ఓట్ల చీలిక వుంటుందని అంచనా వేశాయి. ఇండియాటీవీ-సిఎన్ఎక్స్, ఎబీపీ-నీల్సన్, సిఓటర్ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్లో ఓట్ల చీలికను అంచనా వేశాయి. ముందుగా ఈ అంచనాలను పరిశీలిస్తే కేవలం కొద్ది భాగం ఓట్లు మాత్రమే ఎన్డీయేకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయని ఈ సంస్థ అంచనా వేసింది. నీల్సన్ సర్వే ఇందుకు పూర్తి విరుద్ధంగా వుంది. ఎన్డీయే 22 స్థానాలు గెలుస్తుందని ముందు చెప్పిన ఈ సంస్థ తరువాత తన అంచనాలను 33 స్థానాలకు సవరించింది. ఇండియాటుడే-యాక్సిస్ పోల్ సర్వేలు ఎన్డీయేకు 62-68స్థానాలు లభిస్తాయనీ, మహా కూటమికి 10-16 స్థానాలు దక్కుతాయని అంచనా వేశాయి. చాణక్య పోల్ ఎన్డీయేకు 65, మహాకూటమికి 13 స్థానాలను అంచనా వేసింది. న్యూస్-18 సంస్థ కూడా ఎన్డీయేకు 60, మహాకూటమికి 18 స్థానాలను అంచనా వేసింది. అన్ని వర్గాలలోనూ మోడీ వేవ్ బలంగా వుండటమే తమ అంచనాలకు కారణమని ఈ సంస్థలు వివరించాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సర్వే చేసిన నేషనల్ వాయిస్ ఛానల్ మాత్రం మహాకూటమికి 48 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. ఆంత్రో సంస్థ కూడా మహాకూటమికి 54 స్థానాలు, ఎన్డీయేకు కేవలం 22 మాత్రమే దక్కుతాయని అంచనా వేసింది. ఈ రెండు సంస్థలు మాత్రమే కేవలం స్థానాల వారీగా ఓటింగ్ షేర్ను అంచనా వేసి తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. వాస్తవానికి స్థానాల వారీ అంచనాలే ఈ రెండు ఎగ్జిట్పోల్స్కూ బలం చేకూర్చాయని చెప్పవచ్చు. అంటే ఇతర పోల్స్ కన్నా ఇవి విశ్వసనీయమైనవన్న భావన ప్రబలుతుండటంతో యూపీలో మహా కూటమి ఘన విజయం సాధించే అవకాశాలే కన్పిస్తున్నాయి. ఇలా ఎగ్జిట్పోల్స్ ఇచ్చిన ఫలితాలు గతంలో మారిపోయినట్టు రుజువులు ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఓటమి ఖాయమని సర్వేలిస్తే.. ప్రత్యర్థి పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్నది. మరీ 15వ లోక్సభ ఫలితాల్లో ఎగ్జిట్ ఎటు... ఏం జరగబోతున్నది..ఇది తేలాలంటే..రేపు విడదలయ్యే ఫలితాల కోసం ఓపికపట్టాల్సిందే.