Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ హైకోర్టు ఆదేశాలు
తిరువనంతపురం : ప్రభుత్వ అనుమతులు లేని పాఠశాలలను మూసివేయాలని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే ఈ ఆదేశాలను పాటించాలని ఆదేశించింది. దీనిపై కేరళ ప్రభుత్వం తరఫున కోర్టులో వాదిస్తున్న సి. రామకృష్ణన్ మాట్లాడుతూ.. అనుమతుల్లేకుండా అక్రమంగా నడిచే స్కూళ్లన్నీ మూసివేయాలని తీర్పులో పేర్కొన్నట్టు తెలిపారు. దీనిపై ఆయా ప్రయివేటు బడులకు గతంలోనే ఆదేశాలిచ్చామని.. కానీ వారు దీనిని పెడచెవిన పెట్టారని తెలిపారు. ఇక నుంచి కొత్త విద్యాసంస్థను స్థాపించాలనుకుంటే దానికి ప్రభుత్వ నిబంధనలతో కూడిన అనుమతులు తప్పనిసరని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇంగ్లీషు మీడియం స్కూళ్లుండగా.. వీటిలో 870 వరకు అన్ఏయిడెడ్ పాఠశాలలు సీబీఎస్ఈ, ఇతర బోర్డుల అనుబంధం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నట్టు వివరించారు. కొత్త పాఠశాలలు నెలకొల్పేవారు 350 మంది కంటే ఎక్కువ విద్యార్థులుండేలా చూసుకోవాలని.. దీంతోపాటు 2.8 ఎకరాల ప్రాంగణం, ఆడుకోవడానికి ఆటస్థలం, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని హైకోర్టు తన తీర్పులో తెలిపింది.
కాగా మూసివేసే స్కూళ్లలోని విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం వారికి కొన్ని నిబంధనలు సడలించింది. వీటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరే ఏడో తరగతి లోపు విద్యార్థులకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు (టీసీ) అవసరం లేదని తెలిపింది. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు వయస్సుకు సంబంధించిన ధ్రువపత్రాలుంటే చాలని ప్రకటించింది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గడిచిన రెండేండ్లుగా కేరళలో ప్రభుత్వ బడులలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది.
గడిచిన విద్యా సంవత్సరంలో 1 లక్షా 85 వేల మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరగా.. ఏయిడెడ్ స్కూళ్లలో దాదాపు 40 వేల మంది చేరారు. 13వేల గవర్నమెంట్ స్కూళ్లున్న కేరళలో.. గతంతో పోల్చుకుంటే సర్కారు బడులలో చేరుతున్నవారు 6.3 శాతం పెరగగా.. ఏయిడెడ్ స్కూళ్లలో 5.4 శాతం పెరిగింది. అదే సమయంలో అన్ఎయిడెడ్, ప్రయివేటు బడులలో చేరుతున్న వారి సంఖ్య 8 శాతానికి పడిపోయింది.