Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమెను గుర్తుచేసుకున్న కేరళ ఆరోగ్యమంత్రి
కోజికోడ్ : ప్రమాదకరమైన నిఫా వైరస్ బాధితులకు వైద్యసేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన కేరళకు చెందిన నర్సు లినీ పుతుస్సెరీని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి శైలజతోపాటు పలువురు ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. కేరళను వణికించిన నిఫా వైరస్తో గత ఏడాది 12 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో వారికి సేవలందించిన నర్సు లినీ గత ఏడాది మే 23న అదే వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకరమని తెలిసినా ధైర్యంగా నిఫా వ్యాధిగ్రస్తులకు సేవలందించి, ఆమె చనిపోవడం పలువురిని కంటతడిపెట్టించింది. ఆమె మరణంతో ఆమె భర్తతోపాటు ఇద్దరు పిల్లలు తల్లడిల్లారు. మంగళవారం ఆమె మొదటి వర్థంతి కావడంతో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ లినీ త్యాగనిరతిని, సేవలను తన ఫేస్బుక్ పేజీలో గుర్తు చేసుకున్నారు. పెరంబరా తాలూకా ఆసుపత్రిలో నిఫా వైరస్తో బాధపడుతున్న సబిత చేరారు. సబిత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కోజికోడ్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించారు. ఆసుపత్రిలో సేవలందించిన లినీ తలనొప్పి, జ్వరానికి గురయ్యారు. అనంతరం ఆ వ్యాధి ఇంకెవరికీ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బహ్రెయిన్లో ఉన్న తన భర్తకు 'నేను వెళ్లిపోతున్నాను. మనం మళ్లీ కలవలేకపోవచ్చు. క్షమించాలి. మన పిల్లలు లవన్, కుంజులను జాగ్రత్తగా చూసుకోండి' అంటూ లేఖ రాశారు. ఆమె భర్త బహ్రెయిన్ నుంచి వచ్చేసరికే కన్నుమూసారు. ఆమె గుర్తుగా కేరళ ప్రభుత్వం 'సిస్టర్ లినీ పుతుస్సెరీ అవార్డు' ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్ఒ) హెల్త్ వర్క్ ఫోర్సు డైరెక్టర్ క్యాంప్బెల్ లినీ ప్రాణత్యాగాన్ని కొనియాడారు. కేరళ ప్రభుత్వం లినీ భర్తకు కోజికోడ్లోని మెడికల్ కార్యాలయంలో లోవర్ డివిజన్ క్లర్క్గా ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఇద్దరు పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేసింది.