Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈవీఎంల పనితీరు, భద్రత ఈసీ చూసుకోవాలి
- ట్యాంపరింగ్పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆందోళన
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో వస్తాయనగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, వాటి భద్రత అంతా ఎన్నికల సంఘమే చూసుకోవాలనీ, ఈవీఎంల ట్యాంపరింగ్పై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు తనని ఆందోళనకు గురిచేశాయనీ ఆయన అన్నారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి ప్రస్తుత కమిషనర్ల వరకు ప్రతిఒక్కరూ కీలక పాత్ర పోషించారన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల సంఘం పనితీరుతో పాటు పలు సంస్కరణలపై మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే...
''దేశంలోని సంస్థలన్నింటినీ మరింత బలోపేతం చేయాలంటే అవన్నీ సక్రమంగా పనిచేసే అవకాశం కల్పించాలి. మన దేశంలో ప్రజాస్వామ్యం విలసిల్లుతోందంటే.. సుకుమార్ సేన్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల కమిషనర్లనంతా బాధ్యతాయుతంగా పనిచేయడం వల్లే అది సాధ్యమయింది'' అని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. అనేక ఏండ్ల కృషితో నిర్మించుకున్న వ్యవస్థలు, సంస్థలను ఉపయోగించుకోవడంలోనే మన సమర్థత దాగి ఉందని హితవు పలికారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్లో పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నికల నిర్వహణ ప్రక్రియంతా పూర్తయి కేవలం ఫలితాల ప్రకటనే మిగిలి ఉన్న తరుణంలో విపక్షాలన్నీ ఎన్నికల సంఘంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈసీ అధికార పక్షానికి అనుకూలంగా పనిచేసిందనీ, ప్రధాని మోడీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై మెతక వైఖరి ప్రదర్శించిందనీ పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మోడీకి ఈసీ లొంగిపోయిందనీ, ఒకప్పుడు సంస్థపై గౌరవం, భయం ఉండేవనీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజే ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.