Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయపరంపర కొన సాగుతోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)సీి-46 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రోకు నమ్మినబంటైన పీఎస్ఎల్వీ సీి-46 రాకెట్ ద్వారా 615 కిలోల బరువైన రీశాట్ 2బీ ఉపగ్రహాన్ని నిర్ధిష్ట్ట కక్ష్యలో 557 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. పీఎస్ఎల్వీ ప్రయోగాల పరంపరలో ఇది 48వ ప్రయోగం. ఈ ఏడాది ఇప్పటి వరకు షార్ నుంచి మూడు విజయవంతమైన ప్రయోగాలు జరిగాయి. తాజా ప్రయోగంతో ఇస్రో మరో ముందడుగు వేసింది. దేశ రక్షణ, వ్యవసాయ, అటవీ, ప్రకృతి వైపరీత్యాలపై ఇది నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఏడాది జులైలో చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ తెలిపారు.
చంద్రయాన్-2 కు రంగం సిద్ధం
భారత అంతరిక్ష ప్రయోగాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్-2 కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జూలై 9 నుంచి 16 మధ్యలో దీనిని ప్రయోగిస్తామని ఇస్రో చైర్మెన్ డాక్టర్ శివన్ తెలిపారు. ఇస్రోకు 'చంద్రయాన్-2' అత్యంత సవాలుతో కూడిన మిషన్ అని, దీనిని విజయవంతంగా ప్రయోగిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు రూ. 800 కోట్ల ఖర్చుతో కూడుకున్న ఈ మిషన్ను ఈ ఏడాది జనవరిలో ప్రయోగించాలని చూసినా అప్పుడు వీలు కాకపోవడంతో వాయిదా వేశారు. చంద్రమండలంలోకి ఇంతవరకు ఎవరూ అడుగిడని ప్రాంతంలోకి దీనిని పంపించనున్నట్టు శివన్ తెలిపారు. ఈ మిషిన్లో ఒక మహిళా వ్యోమగామిని పంపడానికి ఇస్రో యోచిస్తున్నట్టు ఆయన గతంలో తెలిపిన విషయం విదితమే.