Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడే సార్వత్రిక తీర్పు
- లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు
- ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
- తేలనున్న అభ్యర్థుల భవితవ్యం.. ఆసక్తిగా యావత్ భారతం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రజల తీర్పు నేడు వెలువడనున్నది. 17వ లోక్సభలో 542 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు ఏడు దశల్లో జరిగిన పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు(గురువారం) మరో కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈసీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘ అధికారులతో సీఈసీ సమన్వయం చేస్తుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఢిల్లీలోని సీఈసీ ప్రధాన కార్యాలయం(నిర్వచన్ భవన్)లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఫిర్యాదులు స్వీకరిస్తారు. 24 గంటల సేపు ఈవీఎం కంట్రోల్ రూంలను నిర్వచన్ భవన్ నుంచి సమన్వయం చేస్తారు. అలాగే మరోవైపు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని లేఖ రాసింది. దేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 543 లోక్సభ స్థానాలకు గానూ, తమిళనాడులో వెళ్లూర్ లోక్సభ నియోజకవర్గం ఎన్నిక రద్దు కావడంతో 542 స్థానాలకే పోలింగ్ జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 175, ఒడిషాలో 117, అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ ఏర్పడిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరిగాయి.
దాదాపు రెండు నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఏప్రిల్ 11న తొలిదశతో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ, మే 19న ఏడో దశ(తుది దశ) పోలింగ్తో ముగిసింది. దాదాపు 40 రోజులుగా ఎదురు చూస్తున్న ఫలితాలు నేడు వెలువడుతుండటంతో యావత్ భారతం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కొన్ని రాష్ట్రాలు మినహా, ఎక్కువ రాష్ట్రాల్లో పోలింగ్ జరిగి దాదాపు నెల రోజులు కావొస్తుంది. ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు ఫలితాలు కోసం ఎదురు చుస్తున్నారు. అభ్యర్థుల గుండెల్లో దడకు నేడు తెర పడనున్నది.