Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాన్ని పాలించేవారికే మోడీ అంటే భయం
- సీమ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడదాం : పవన్
అమరావతి: ఇకపై తన రాజకీయ ఎత్తుగడ ఎంటో చూపిస్తానని, అది మార్పు వచ్చేవరకూ, శ్రీకాకుళంలో వలసలు ఆగేవరకూ ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్యారు. తాను స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆదివారం రాయలసీమ జిల్లాల జనసేన అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడదామని, సహజ వనరులున్నా అక్కడి ప్రజలు ఉపాధి కోసం వలస పోతున్నారని. సీమ సమస్యలను అక్కడి నాయకులు పట్టించుకో వడంలేదన్నారు. రాయలసీమ, ఉత్త రాంధ్ర జిల్లాలు కొన్ని కుటుంబాల గుప్పెట్లో ఉండిపోయాయని, వారిని తట్టుకుని నిలబడి, ఎన్ని ఒత్తిళ్లనైనా భరించి ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేమో చూస్తానని, రాజకీయాల్లో అన్నింటినీ తట్టుకునే ధైర్యం తనకుందని చెప్పారు. ప్రధాని పిలిస్తే ఎందుకు వెళ్లలేదని తనను చాలామంది అడిగారని, అందుకు రాష్ట్ర శ్రేయస్సే తనకు ముఖ్యమని సమాధానమిచ్చానన్నారు. రాష్ట్రాన్ని పాలించే వారికే మోడీ అంటే భయం ఉందని, తనకు మోడీ అంటే భయం లేదని, కేవలం ప్రధాని అనే గౌరవం మాత్రేమే ఉందన్నారు. ఎన్నికల్లో ఓటమితో కుంగిపోవాల్సిన అవసరంలేదని కార్యకర్తలతో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో జనసేన బలాన్ని పెంచుకోవాలన్నారు.అందుకోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలనీ, ప్రజా క్షేత్రంలో ఎక్కువ సమయం వెచ్చించాలని కార్యకర్తలకు పవన్ సూచించారు. జనసేన పార్టీ పట్ల ప్రజలకు గౌరవం ఉందని, అయితే ఎంతవరకు నిలబడతామో ప్రజలు పరీక్షిస్తున్నారని అన్నారు. ఓటమి ఎదురైనప్పుడే ఎవరు నిలబడతారో తెలుస్తుందని, జనసేన ఇప్పుడే నిజమైన పార్టీగా అవతరించిందన్నారు. రాజకీయాల్లోకి ఇష్టంగా వచ్చానని, క్రమంగా తన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని అన్నారు. పార్టీని ఎందరు వీడినా తాను మాత్రం ఒక్కడినే నిలబడతానని అన్నారు. తాను హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేయననీ, అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. తనకు రాజకీయ వ్యూహాలు తెలుసని, కానీ ఆశయాలతో ఎంతవరకు తట్టుకోగలనో చూపించానని అన్నారు.
జనసేనలోనే నాదెండ్ల మనోహర్
నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలోనే ఉన్నారని, ఆయన పార్టీ మారేదిలేదని జనసేన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గుంటూరు జిల్లా అభ్యర్థులతో నిర్వహించిన సమావేశానికి మనోహర్ హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనతో ఫోన్లో సంప్రదించి, పార్టీ మారడంలేదనే స్పష్టత తీసుకున్నట్టు తెలిపింది. ప్రసుత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నారని, అందుబాటులో లేని సమయంలో ఇటువంటి పుకార్లు వచ్చాయని స్పష్టం చేసింది.