Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీతో మిత్రత్వంపై జేడీయూ
- పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా..
పాట్నా : కేంద్ర మంత్రివర్గంలో చేరని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) బీజేపీతో పొత్తులపరంగా కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. తాము బీజేపీితో రాష్ట్రంలోనే భాగస్వాములమని, కేంద్రంలో కాదని ఆ పార్టీ స్పష్టం చేసింది. బీహార్ రాజధాని పాట్నాలో జెడియు అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకు సంబంధించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశానికి జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, సీనియర్ నేతలు, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల్లో కూడా నూతన చేరికలను ప్రోత్సహించి పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని నేతలకు నితీష్ సూచించారు. ఇటీవల జరిగిన అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీయూ మంచి పనితీరు ప్రదర్శించింది. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీచేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో జేడీయూ, బీజేపీ కలిసి పోటీచేసిన సంగతి తెలిసిందే. పోటీచేసిన 17 స్థానాల్లో 16 నియోజకవర్గాల్లో జేడీయూ విజయం సాధించింది. కేంద్ర మంత్రివర్గంలో రెండు స్థానాలు అడగ్గా, ఒక స్థానమే కల్పిస్తామని బీజేపీ చెప్పడంతో.. జేడీయూ మంత్రివర్గంలోనే చేరకుండా తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేసింది.