Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి వనరుల వినియోగంపై ప్రభుత్వాలు విఫలం
- పథకాలు ఎన్ని వస్తున్నా పరిష్కారం సున్నా
- మోడీ సర్కార్ తెచ్చిన మరో పథకం 'నల్ సే జల్'
న్యూఢిల్లీ : 30 మే 2019న దేశంలోని 91భారీ రిజర్వాయర్లలో నీటిమట్టాలు కిందికి పడిపోయాయి. ఈ రిజర్వాయర్లలో నమోదైన నీటి సామర్థ్యం 20శాతం. పలు రాష్ట్రాల్లోనూ ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడితో అష్టకష్టాలు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి వనరుల వినియోగంపై ప్రభుత్వాలకు ముందు చూపులేకపోవటం, ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. వేలకోట్ల నిధులు, వందల సంఖ్యల నీటి పథకాలు ఉన్నా, సమస్య మాత్రం అలాగే ఉందన్నది పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో తాగునీటి కష్టాలపై 'నిటి ఆయోగ్' 2018లోనే నివేదిక విడుదల చేసినా, మోడీ సర్కార్-1 తీసుకున్న చర్యలు శూన్యం.
ఉత్తర, దక్షిణ...అన్నతేడా లేకుండా దేశంలోని 60కోట్ల మందిని నీటికష్టాలు వేధిస్తున్నాయి. దేశ జనాభాలో సగంమందికిపైగా ప్రతీఏటా నీటికష్టాల్ని ఎదుర్కొంటు న్నారు. ఈనేపథ్యంలో కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన మోడీ సర్కార్ మే 31, 2019న ప్రకటించిన పథకం 'నాల్ సే జల్'(పైపుల ద్వారా తాగునీరు). ఇందుకోసం ప్రత్యేకంగా 'జల్ శక్తి' అనే మంత్రిత్వ శాఖను సైతం ఏర్పాటుచేశారు. నీటి వనరులు, నదులు, గంగా పునరుజ్జీవనం... అంతా కూడా ఈ శాఖ కిందకు తీసుకువచ్చారు. సమస్యంతా 'నీటి వనరుల వినియోగం'తో వస్తోందని 'నిటి ఆయోగ్' నివేదిక తేల్చింది.
భూగర్భ జల వనరులు నానాటికి అడుగంటుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి 21 నగరాల్లో 2020నాటికి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతాయని నివేదిక తెలిపింది. దీనివల్ల 10కోట్లమంది జీవితాలు ప్రభావితం కానున్నాయి. పరిస్థతి ఇలాగే కొనసాగితే 2030కల్లా దేశంలోని 40శాతం మంది జనాభాకు తాగునీరు కరవవుతుంది. ఈ పరిణామాలు దేశాభివృద్ధిపై, ఆర్థికరంగంపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీటి కష్టాల వల్ల 6శాతం జీడీపీ పడిపోతుందని అంచనా. ఆయా రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తోందని నివేదిక పేర్కొన్నది. శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేక ప్రతీఏటా 2లక్షలమంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
- ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 16శాతం. మనకున్న జలవనరులు కేవలం 4శాతం. ఇందులో 70శాతం కలుషితమవుతోంది. శుద్ధమైన తాగునీటి సరఫరాలో భారత్ ప్రపంచర్యాంక్ 120.
- రాష్ట్రాలవారిగా పరిశీలిస్తే, 'నీటి నిర్వహణ'లో 14 రాష్ట్రాల స్కోరు 50శాతం కన్నా తక్కువగా ఉంది.
- కరువు పరిస్థితులు ఏర్పడి కర్నాటకలో 80శాతం, మహారాష్ట్రలో 72శాతం ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
- చెన్నైకి నీటి సరఫరా చేసే నాలుగు రిజర్వాయర్లలో ఉన్న నీరు 1శాతం. దీంతో నగరంలోని 40శాతం మందికి తాగునీటి సరఫరా ఆగిపోయింది.