Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్రా, తమిళనాడులోనూ అధికారంలోకి..
- ఎన్నికల్లో గెలవడమే కాదు... ప్రజా మెప్పు పొందాలి : ప్రధాని మోడీ
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. 'భారీ ఆధికత్యతతో జనం మళ్లీ బీజేపీకి అధికారం కట్టబెట్టారు. ప్రజలు మెచ్చే పాలనను తీసుకొస్తాం' అని అన్నారు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనూ భవిష్యత్తులో బీజేపీకి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో గెలవడమే కాదని, ప్రజా మెప్పు పొందాలని బీజేపీ శ్రేణులకు
సూచించారు. రెండోసారి ప్రధాని అయిన తరువాత శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతికి వచ్చిన ప్రధాని మోడీకి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన శ్రీలంక కొలంబో ముగించుకుని రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 4.30 గంటలకు రావాల్సి ఉండగా, గంట ఆలస్యంగా చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయానికి దగ్గర్లో ఏర్పాటు చేసిన 'ప్రజాధన్యవాద' సభలో ప్రధాని ప్రసంగించారు. కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చినందుకు ప్రసంగానికి ముందు ఆయన క్షమాపణ కోరారు. 130 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని శ్రీవారిని కోరుకునేందుకు వచ్చానన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, ప్రజాహిత పాలన అందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ప్రజా మన్నన పొందాలంటే 365 రోజులూ ప్రజలకు సేవ చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విద్యావంతులని, ముందుకెళ్లే సాహసం చేసేవారని అన్నారు. రైతుల దగ్గర నుంచి శాస్త్రవేత్తల వరకూ రాష్ట్రంలో ఉన్నారని, టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తున్నారని, ఈ సందర్భంలో ప్రత్యేకించి బీజేపీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం 6.10 గంటకు సభను ముగించుకుని రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. బహిరంగ సభకు ముందు ప్రాంగణంలో వేసిన షామియానాలు గాలివానకు పడిపోయాయి. బీజేపీ జెండాలు ఎగిరిపోయాయి.