Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుకూలంగా ఆర్బీఐ తాజా నిబంధనలు
- కార్పొరేట్లకు అదనంగా 30 రోజుల గడువు.. ఆ తర్వాతే ఎన్పీఏ
- మోడీ పాలనలో విద్యుత్ సంస్థల మొండి బకాయిలు రూ.1.74 లక్షల కోట్లు
బ్యాంకులకు కార్పొరేట్లు కోట్లాది రూపాయలు కుచ్చుటోపీలు పెడుతుంటే.. నియంత్రించాల్సింది పోయి బడా ఎగవేతదారులకు అనుకూలంగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటున్నది. సంపన్నులకు రాజకీయ నేతల మధ్య ఉన్న పరిచయాలతో బ్యాంకులు నట్టేట మునుగుతున్నా..ఆర్బీఐ గుణపాఠాలు నేర్చుకోవటంలేదు. ఇప్పటికే విజరుమాల్యా,నీరవ్మోడీ లాంటి పెద్దమనుషులు విదేశాల్లో దర్జాగా బతుకుతుంటే.. తాజా నిబంధనల ప్రకారం ఎగవేత దారులకు 30 రోజుల అదనపు సమయం ఇచ్చింది. ఆ తర్వాతే నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ)గా గుర్తించాలంటూ జారీ చేసిన మార్గదర్శకాలు కలకలం రేపుతున్నాయి.
న్యూఢిల్లీ: మొండి బకాయిలకు సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు ఎగవేతదారులుగా మారుతున్న కార్పొరేట్లకే అనుకూలంగా ఉన్నట్టు బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. రుణాలు తిరిగి చెల్లించాల్సిన సమయం అదనంగా మరో 30రోజులు దాటితేనే బ్యాంకులు వాటిని నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు)గా ప్రకటించాలని ఈ నెల 7న ఆర్బీఐ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఏప్రిల్లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాంతో, ఈ నూతన నిబంధనలను ఆర్బీఐ రూపొందించింది. ఫిబ్రవరి ఆదేశాల ప్రకారం రుణాల చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యమైనా రుణపరిష్కార ప్రణాళి కను ప్రారంభించాలి. 2018, మార్చి 1 వరకు రూ.2000 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ రుణాలు తీసుకున్న కంపెనీలకు 180 రోజుల్లోగా రుణ పరిష్కార ప్రణాళిక అమలు కావాలి. 180 రోజుల తర్వాత 15 రోజుల్లోగా దివాలా ప్రక్రియ ప్రారంభించాలి. మారిన నిబంధనల ప్రకారం 180 రోజుల ప్రణాళికకు ముందు(రుణ చెల్లింపులో విఫలమైన రోజు నుంచి) 30 రోజులపాటు రుణ గ్రహీతలకు వెసలుబాటు కల్పించారు. ఈ 30 రోజుల సమయంలో రుణ వసూళ్ల ప్రణాళికను బ్యాంకులు(రుణ సంస్థలు) నిర్ణయించుకోవాలి. ఈ 30 రోజులను సమీక్షా కాలంగా ఆర్బీఐ పేర్కొన్నది. రుణ పరిష్కార ప్రణాళిక రూపకల్పన, అమలు కోసం తాజా ఆదేశాల వల్ల(ఏదైనా కంపెనీని ఎగవేతదారుగా ప్రకటించిననాటి నుంచి) మొత్తం 210 రోజుల సమయం బ్యాంకులకు లభిస్తుంది. ఆర్బీఐ కొత్త నిబంధనలు రూ.2000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలందరికీ వర్తిస్తాయి. రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల మధ్య రుణాలకు 2020, జనవరి 1 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి.
80 శాతం ఎగవేతలు మోడీ హయాంలోనే..!
ఎగవేతదారుల్లో కార్పొరేట్ విద్యుత్ కంపెనీలదే అధిక వాటా అన్నది గమనార్హం. ఎన్పీఏలుగా మారిన 34 థర్మల్ విద్యుత్ కంపెనీల(వీటిలో 32 కార్పొరేట్ సంస్థలు) రుణాల విలువ లక్షా 74 వేల కోట్ల రూపాయలు. 2018 మార్చి వరకల్లా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు తీసుకున్న మొత్తం అప్పుల విలువ రూ.5.65 లక్షల కోట్లు. ఈ రుణాల్లో అధికభాగం ఇచ్చింది ప్రభుత్వరంగ బ్యాంకులే. ఆర్థికశాఖకు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం 2018, డిసెంబర్ వరకు ఎన్పీఏల మొత్తం రూ.8.64 లక్షల కోట్లు. బ్యాంకులిచ్చిన మొత్తం రుణాలు రూ.63.21 లక్షల కోట్లలో ఎన్పీఏల వాటా 13.6 శాతం. గత పదేండ్లలో రైటాఫ్లుగా ప్రకటించిన ఎన్పీఏల విలువ రూ.7 లక్షల కోట్లు కాగా, 2014 నుంచి 2018 వరకు వాటి విలువ రూ.5.56 లక్షల కోట్లు. అంటే ఇది దాదాపు 80 శాతం. అంటే మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో బ్యాంకు ఎగవేతలు మరింత పెరిగాయేతప్ప తగ్గలేదని అర్థం.