Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో అవినీతి గురించి చెబితే సన్మానాలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తుంటే ఇప్పటి దాకా ఆయన చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని తేలిపోయిందని టీడీపీ జాతీయ అధó్యక్షులు చంద్రబాబునాయుడు అన్నారు. జగన్ వ్యాఖ్యల్ని ప్రజలే అర్థం చేసుకుంటారన్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో సోమవారం టీడీపీ సీనియర్ నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయపరిణా మాలు, కార్యకర్తలపై దాడులు గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో చేపట్టిన పనులన్నింటినీ టీడీపీ ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టి కొన్నింటిని పూర్తి చేశామన్నారు. మరికొన్ని పనులు చివరిదశకు చేరితే వాటిని ఆపేసి అవినీతి బురద జల్లడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఇస్తామని, ఇప్పుడేమో మేమే చేస్తామంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే రైతులు సగం సీజన్ కోల్పోయారని, కేంద్రం నుంచి రావాల్సిన రూ.4వేల కోట్లు తెచ్చే ప్రయత్నం లేదన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అనేక ప్రాజెక్టులు ప్రారంభించామని, ఏ మాత్రం ఆలోచన లేకుండా వీటిని నిలిపివేస్తామని అంటుండటం సరైందికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతులకు కావాల్సిన రుణమాఫీ 4, 5 విడతలకు సంబంధించిన కిస్తీలువెంటనే చెల్లించాలని, అక్టోబరు 15 నుంచి రైతుభరోసా అని అంటూనే ఈ ఖరీఫ్లో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం నిలిపివేయడం సరైంది కాదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు నిలిపివేయడం కరెక్ట్కాదని, ప్రభుత్వాలు మారినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పనులు నిలిపివేయడం మంచిది కాదన్నారు.
15న వర్క్షాప్
ఈనెల 15న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహిస్తున్నామని చంద్రబాబునాయుడు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాల సమాచారాన్ని తెప్పిస్తున్నామన్నారు. ఒక రోజు నిర్వహించే వర్క్షాప్లో వీటి గురించి చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయన్నారు. పిఠాపురం, నరసరావుపేట, రేపల్లె, గురజాల, అనంతపురం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో జరిగిన దాడులపై సమావేశంలో తీవ్రంగా నిరసించారు.