Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్టు అప్రజాస్వామికమని వ్యాఖ్య
లక్నో / న్యూఢిల్లీ : నోయిడాకు చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్టు అప్రజాస్వామికమని.. ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసులు తన భర్తను అదుపులోకి తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దీనిపై నేడు (జూన్ 11న) విచారణ చేపట్టనుంది. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్పై ఓ మహిళ మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నందుకు గానూ మూడు రోజుల క్రితం యూపీ పోలీసులు కనోజియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కనోజియానే గాక నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న 'నేషన్ లైవ్' అనే ఆంగ్ల ఛానెల్ హెడ్, ఎడిటర్లనూ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, సీఎంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గడిచిన నెల రోజుల్లోనే నలుగురు పౌరులను పోలీసులు అరెస్టు చేయడాన్ని సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.
బీజేపీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తోంది
ఢిల్లీలో జర్నలిస్టుల ర్యాలీ
బీజేపీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తోందని జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియా, నోయిడాలోని ఓ న్యూస్ ఛానల్ హెడ్ ఇషితా సింగ్, ఆ ఛానల్ ఎడిటర్ అనుజ్ శుక్లాల అరెస్ట్లకు వ్యతిరేకంగా జర్నలిస్టు సంఘాలు ఢిల్లీలో సోమవారం ర్యాలీ నిర్వహించాయి. ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ నుంచి రైలు భవన్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ చేపట్టాయి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కనోజియా భార్య జగీషా అరోరా మాట్లాడుతూ.. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఆరోపించారు. గిల్డ్ ఇండియా ఎడిటర్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, భారత మహిళా ప్రెస్ కార్పొరేషన్, దక్షిణాసియా మహిళా మీడియాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీలో పలు ఇతర మీడియా సంస్థలు, జర్నలిస్ట్లు పాల్గొన్నారు.