Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: ఉత్తరప్రదేశ్ మీరట్ పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్స్ పై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. వారిని విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ వీడియోలో దాదాపు 8మంది పోలీసులు ట్రాన్స్జెండర్లపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ విషయమై మీరట్ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ నితిన్ తివారీ మాట్లాడుతూ... స్థానికంగా నివాసం ఉంటున్న ట్రాన్స్జెండర్లు సేకరించిన డబ్బులు, బహుమతుల విషయమై రెండు గ్రూపులు ఘర్షణ పడుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి స్థానికులు సమాచారం అందించారు. వారి గొడవను పోలీసు స్టేషన్లో పరిష్కరించుకోవాలనీ, వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అయితే పోలీసులు వీరితో మాట్లాడే క్రమంలో మళ్లీ గొడవపడ్డారు. అక్కడ మొత్తంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ తగాదాను అదుపుచేయడానికి లాఠీఛార్జీ చేయాల్సి వచ్చిందనీ ప్రాథమిక సమాచారం అందిందని ఆయన తెలిపారు. అయితే దీనిపై దర్యాప్తు జరిపించనున్నామని తెలిపారు.
అయితే వీరందరూ బహిరంగంగానే జనాల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు స్థానికులు వాపోయారు. గత నాలుగేండ్లలో రైల్వే ప్రయాణీకుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న 73 వేల మంది ట్రాన్స్జెండర్లు అరెస్టు అయ్యారనీ, వారిలో ఏడాదిలో 20వేల మంది ఉన్నారనీ సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. సామాజంలో లింగమార్పిడికి పాల్పడిన వ్యక్తులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవలి కాలంతో పోలిస్తే అది చాలా వరకు తగ్గిందని పలు సర్వేల్లో వెల్లడైంది.