Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్గాంధీ వాయనాడ్ పర్యటనపై రాజకీయ విశ్లేషకులు
- హిందీ రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకోవటంపై ఆలోచించాలని సూచన
న్యూఢిల్లీ : అబద్ధాలతో, విద్వేషంతో ఎన్నికల్లో ప్రధాని మోడీ విజయాన్ని అందుకున్నారనీ, అబద్ధాలతో ప్రజల్లో భ్రమలు కల్పించి అధికారాన్ని దక్కించుకున్నారనీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ 'వాయనాడ్' పర్యటనలో ఆరోపించిన సంగతి తెలిసిందే. సత్యానికి, ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబడిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలేగనుక నిజమైతే రాహుల్గాంధీ మొదట 'అమేథి నియోజకవర్గం'లో పర్యటించాల్సిందనీ, వాయనాడులో కాదనీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా 'సత్యం, ప్రేమ, ఆప్యాయత'అనేవి రాహుల్గాంధీ రాజకీయ ఆయుధాలైతే, అందుకు సరైన స్థలం 'అమేథి' అవుతుందనీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
లోక్సభ ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీని, రాహుల్గాంధీని ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారన్నది వాస్తవం. ఫలితాల అనంతరం పార్టీలో సీనియర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్గాంధీ రాజీనామా అస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే. అయితే వాయనాడ్ పర్యటనలో ఆయన మాట్లాడిన తీరును చూస్తే, ఓటమి తెచ్చిన సంక్షోభం నుంచి కాస్త బయటపడినట్టే కనపడుతున్నారు. కేరళలో 'ప్రేమ, ఆప్యాయాత' అనే సందేశాన్ని వినిపించిన రాహుల్గాంధీ, ప్రతిపక్ష నాయకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినట్టే భావించాలి. పార్టీని సైతం ఇదే తీరుగా పునరుజ్జీవనం చేయగలరా అన్నది చూడాలి! ప్రేమ, ఆప్యాయతలతో తాను తన పార్టీ ప్రజల దగ్గరకు వెళితే, ఎన్నికల్లో వారు ఎందుకు తిరస్కరించారో రాహుల్గాంధీ నేతృత్వంలోని పార్టీ సమీక్ష చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమేథిలో రాహుల్గాంధీపై బీజేపీ అభ్యర్థి స్మృతీఇరానీ 55వేల ఓట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. 2014లో రాహుల్కు ఇక్కడ 4.08లక్షల ఓట్లు వస్తే, 2019లో 4.13లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, రాహుల్గాంధీ పట్ల ఉన్న అసంతృప్తి ఓటింగ్ సరళిలో కనపడుతోంది.
అమేథి ఫలితాల్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీని ప్రజలకు దగ్గరచేయడానికి ఏమి చేయాలో అది చేయకుండా, కేవలం స్థానిక నాయకుల్ని నమ్ముకుంటే ఏం జరుగుతుందో 'అమేథి' ఫలితం చెబుతోంది. ఈ తరహా రాజకీయాల నుంచి కాంగ్రెస్ బయటపడకపోతే, బీజేపీ, ఆ పార్టీ మత రాజకీయాల్ని ఎదుర్కోలేదనీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని పొందకపోవటం బీజేపీకి కలిసివచ్చింది. యూపీ, బీహార్, రాజస్థాన్; మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాల్లో కేవలం 4స్థానాల్ని కాంగ్రెస్ గెలుచుకుంది.