Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ 'కోడ్ ఉల్లంఘనల' సమాచారంపై ఈసీ
- ఆర్టీఐ దరఖాస్తుకు ఎన్నికల కమిషన్ సమాధానం
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచార క్యాంపెయిన్లలో నరేంద్ర మోడీ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వబోమని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి మోడీ, ఇతర నాయకులపై అందిన ఫిర్యాదులు, వాటికి ఈసీ ఇచ్చిన క్లీన్ చిట్ల వివరాలను తెలియజేయాల్సిందిగా ఒక ఆర్టీఐ దరఖాస్తు దాఖలైంది. మోడీకి ఇచ్చిన 'క్లీన్ చిట్' నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తెలిపిన అసమ్మతి నోట్ కాపీనీ అందించాల్సిందిగా ఆ దరఖాస్తులో ఓ పాత్రికేయుడు కోరారు. అయితే, ఈ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా సదరు వివరాలను అందించేందుకు ఈసీ తిరస్కరించింది. ఆ సమాచారాన్ని సమీకరించి సంగ్రహించేందుకు సంస్థ వనరులు పెద్దమొత్తంలో వినియోగించాల్సి వస్తుందని సమాధానమిచ్చింది. అలాగే, క్లీన్ చిట్ నిర్ణయాల్లో ఎన్నికల కమిషనర్ అసమ్మతి నోట్ కాపీ సమర్పించేందుకూ తిరస్కరించడం గమనార్హం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత ప్రాంతాల్లోని విభాగాలే నిర్ణయాలు తీసుకుంటాయని, ఆ వివరాలన్ని సమగ్రంగా లేవని ఈసీ సమాధానమిచ్చింది. ఆ వివరాలన్ని సమగ్రంగా సంగ్రహించేందుకు పెద్దమొత్తంలో వనరులు వినియోగించాల్సి ఉంటుందని తెలిపింది. మోడీకి ఇచ్చిన రెండు క్లీన్ చిట్లలో ఒక ఎలక్షన్ కమిషనర్ అశోక్ లావాసా అసమ్మతిని తెలిపిన విషయం తెలిసిందే. మైనార్టీ వర్గాల ప్రాబల్యంగల వయానాడ్ నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని మహారాష్ట్రలోని వార్దాలో మోడీ చేసిన వ్యాఖ్యలపై, అలాగే బాలాకోట్లో పాల్గొన్న జవాన్లు, పుల్వామాలో మరణించిన వీరజవాన్లకు మొదటిసారి ఓటేస్తున్న యువత తమ ఓటను అంకితం చేయాలని లాతూర్లో చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఇచ్చిన క్లీన్ చిట్ నిర్ణయంలో ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా అసమ్మతిని తెలిపారు. కానీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, ఒక చీఫ్ ఎన్నికల కమిషనర్గల ప్యానెల్ 2:1 మెజార్టీతో మోడీకి క్లీన్ ఇచ్చింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈసీ తన విశ్వసనీయతను కోల్పోయిందని, అధికార పార్టీకి కొమ్ముకాసిందనే తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.