Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాఫ్ట్ హిందూత్వ ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదు
- దేశంలో ఈ అంశాలపై భావజాల సంఘర్షణ అవశ్యం
- ఎన్నికల్లో పార్టీ ఓటమిపై స్థూలంగా చర్చించాం
- బూత్ స్థాయి నివేదికలు వచ్చాక యాక్షన్ ప్లాన్పై దృష్టి పెడతాం
- ముగిసిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ : మీడియాతో సీతారాం ఏచూరి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీ దేశంలో వ్యాప్తి చేస్తున్న హర్డ్కోర్ హిందూత్వకి... కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు అవలంభిస్తున్న మృదు హిందూత్వ ఎంతమాత్రం సమాధానం కాదని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానిం చారు. హిందూత్వ దేశవ్యాప్తంగా కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజానీకం మధ్య మత, కుల, జాతి, ప్రాంతం అంటూ విభజన రేఖలను సృష్టించి భయోత్పాత వాతావరణానికి కారణం అవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో లౌకికవాదం వర్సెస్ హిందూత్వ చర్చ జరగాలని... తమ పార్టీ లౌకిక భావాల రక్షణ కోసం పోరాడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈదేశం మతోన్మాదుల చేతులో ఉండ టం అత్యంత ప్రమాదకరమని అన్నారు. రెండు భావజాల సంఘర్షణకు సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఈ నెల ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు (మూడు రోజుల పాటు) ఢిల్లీలోని ఆ పార్టీ జాతీయ కేంద్ర కార్యాల యంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర కమిటీలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను సోమవారం ఏచూరి మీడియాకు వెల్లడించారు. సీపీఐ, సీపీఐ(ఎం) ఎన్నికల్లో కలిసి చేయడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పొత్తులు పెట్టుకొని బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలని సీపీఐ(ఎం) యత్నించిందన్నారు. ఫలితాలు మాత్రం తమ అంచనాలకు విరుద్ధంగా వచ్చినట్టు తెలిపారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ గెలిచిందన్నారు. గతం ఎన్నికల కంటే కూడా అధిక ఓట్లు సాధించిందన్నారు. ఈ గెలుపు పూర్తిగా జాతీయ, అంతర్జా తీయ పెట్టుబడిదారుల మద్ధతుతోనే ఆ పార్టీకి సాధ్యమైంద ని చెప్పారు. పుల్వామాలో తీవ్రవాదుల దాడి, బాలాకోట్ ఏరో సర్జికల్ స్ట్రైక్స్లను బీజేపీ సర్కారు ఎన్నికల్లో ఉపయో గించుకుందని అన్నారు. ఇందుకు కార్పొరేట్ మీడియా సైతం పెద్ద ఎత్తున మోడీకి సహకరించిందన్నారు. మనీ పవర్ కూడా ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిందన్నారు. బీజేపీ విచ్చలవిడిగా ఖర్చు చేసినా ధన ప్రవాహాన్ని కట్టడి చేయడం లో ఈసీ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాయకత్వం ఉమ్మడి బాధ్యత వహిస్తుందని, ఏ ఒకరిదో బాధ్యత కాదని చెప్పారు. ఎన్నికల్లో కలిసి పనిచేసినట్టుగానే వామపక్షాల నాయకత్వంలోని వర్గ, ప్రజా సంఘాలు కలిసి పనిచేయాలన్నారు. త్వరలో సీపీఐ(ఎం), సీపీఐ ప్రధాన కార్యదర్శులు సమావేశమవుతా రని, పలు అంశాలపై చర్చిస్తారని అన్నారు.
అదేవిధంగా జాతీయ స్థాయిలో లౌకిక పార్టీలను ఏకం చేయడంలో కాంగ్రెస్ ఏమాత్రం సఫలీకృతం కాలేదన్నారు. మత శక్తులను నిలువరించేందుకు లౌకిక పార్టీలున్నాయన్న భావన దేశ ప్రజల్లో కాంగ్రెస్ నింపలేకపోయిందన్నారు. బెంగాల్లో తృణమూల్, బీజేపీ వ్యతిరేక ఓట్లను సంఘటితం చేసేందుకు కడదాకా తాము ప్రయత్నం చేసినా కాంగ్రెస్పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్కి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో గతం కంటే తక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయని అన్నారు. త్రిపుర, బెంగాల్లలో హింసాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ తమకిచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేదని అన్నారు. కేరళలో కొంత విభిన్న ఫలితాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అక్కడ ఓటర్లు భావించడం వల్ల ఆ పార్టీకే ఓట్లు అధికంగా వేసినట్టు వివరించారు. శబరిమలై విషయంలో తమ పార్టీ తీసుకున్న పంథా సరైనదేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నిర్మాణ అంశాలపై దృష్టి
బీజేపీ భారీ గెలుపుతో రాబోయే రోజులు తమ పార్టీకి మరిన్ని సవాళ్ళు ఇబ్బందులు ఎదురు కానున్నట్టు ఏచూరి వెల్లడించారు. ఎన్నికల ఫలితాలతో పాటు ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన నిర్ణయా లపై కేంద్ర కమిటీ చర్చ చేసినట్టు చెప్పారు. స్వతంతంగా తమ పార్టీ శక్తిని బలోపేతం చేసుకునేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశంపై చర్చ జరిపామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు తమ పార్టీ అవలంభించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలపై కేంద్ర కమి టీ చేసిన తీర్మానాలను ఈ సందర్భంగా ఏచూరి ప్రకటిం చారు. కార్మిక వర్గం, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తమ పార్టీ మరిన్ని పోరాటాలు చేపట్టనున్నట్టు వివరించారు. హిందూత్వకి వ్యతిరేకంగా సెక్యులరిజ భావాల వ్యాప్తికి ప్రత్యేకంగా కృషి చేయనున్నట్టు వివరించారు. మైనారిటీలు, దళితులు, గిరిజ నులు, మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. భారత ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అవసరమని వివరించారు. దాంతోపాటు ఎన్నికల కమిషనర్లను నియమించేందుకు ఒక కోలిజయం వంటి వ్యవస్థను రాష్ట్రపతి ఆధ్వార్యాన ఏర్పాటు చేసేందుకు ఉద్యమాలు చేస్తామని వెల్లడించారు. ఈవీఎం నూట్రాలిటీ, అనుమానాలపై సీపీఐ(ఎం) మరింత అధ్యయనం చేస్తు న్నదని ఇతర పార్టీలతోనూ ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతామన్నారు. దాని తర్వాత ఈవీఎంపై తమ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. పేద ప్రజల మౌలిక సమస్యలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలపై దాడులపై వ్యతిరేకంగా పోరాటాలు చేయనున్నామన్నారు. ఆగస్టు వరకు అన్ని రాష్ట్రాల సమీక్షలను పూర్తి చేసి, పార్టీ బలోపేతానికి ఏం చేయాలన్న దానిపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. క్యాడర్లో ఉత్తేజం నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రఖ్యాత మేధావి డాక్టర్ రామ్ పునియానికి బెదిరింపు ఫోన్లు రావడాన్ని పార్టీ కేంద్ర కమిటీ ఖండించినట్టు చెప్పారు. యువ మహిళా డాక్టర్ పాయల్ తాడ్విని ఆత్మహత్యకు కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏచూరి డిమాండ్ చేశారు.