Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం నిర్ణయంతో రైతుల ఆదాయంపై ప్రభావం
న్యూఢిల్లీ :ఉల్లిపై ప్రస్తుతమున్న ఎగుమతి ప్రోత్సాహకాలను కేంద్రం తొలగించింది. దీంతో విదేశాలకు ఉల్లి ఎగుమతిపై భారం పడనున్నది. అది కాస్తా రైతుల ఆదాయంపై పరోక్షంగా ప్రభావం చూపనున్నది. ఎంఈఐఎస్ కింద ప్రస్తుతం ఉల్లి ఎగుమతుల ప్రోత్సాహకాలు 10శాతం మేరకు అందుకుంటున్న ఎగుమతిదారులకు కేంద్రం నిర్ణయంతో వారి ఆదాయానికి గండిపడినట్టయ్యింది. ఇది ఉల్లిరైతులపై కూడా భారంపడనుంది. అయితే దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతుండటంతో దీనిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయమని తెలుస్తున్నది. ఎగుమతి ప్రోత్సాహకాల ప్రస్తుతం 10శాతం ఉన్న రేటును వెనక్కి తీసుకోనున్నట్టు ఈనెల 9న డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) నోటీసునూ జారీ చేసింది. ఉల్లి రైతులకు అధిక ఆదాయాన్ని అందేలా చూసే ఉద్దేశంతో ఐదుశాతంగా ఉన్న ఉల్లి ఎగుమతి ప్రోత్సాహక రేటును పదిశాతానికి పెంచుతూ గతేడాది డిసెంబర్లోనే కేంద్రం నిర్ణయం తీసుకున్నది. కాగా, ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి హౌల్సేల్ మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్గాంలో ప్రస్తుతం ఉల్లి ధర దాదాపు 48శాతం పెరగడం గమనార్హం. అంతకముందు కేజీ ఉల్లి రూ.9 ఉండగా ప్రస్తుతం రూ.13.30కు చేరుకున్నదని అధికారులు తెలిపారు. భారత ఉల్లి ఎగుమతులు 2016-17లో 511.51 మిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది అది కాస్తా 496.76 మిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం.