Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైనికుడిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా
- డిటెన్షన్ సెంటర్లలో ఉన్నవాళ్లలో చాలామంది ఈదేశ పౌరులే.. :
రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ మహమ్మద్ సనా ఉల్లా
న్యూఢిల్లీ : భారత సైనికుడిగా ఎంతో క్లిష్టమైన ప్రాంతాల్లో పనిచేశా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా...అలాంటిది నాపై కేంద్రం 'విదేశీయుడు' అనే ముద్ర వేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని రిటైర్ట్ ఆర్మీ సుబేదార్ మహమ్మద్ సనా ఉల్లా అన్నారు. తనపై హత్యారోపణలు చేసినా ఇంత బాధపడేవాడిని కాదని ఆవేదన చెందారు. జైలు లాంటి డిటెన్షన్ సెంటర్లో బంధించి తనను విచారించారని ఆయన తెలిపారు. ఈ పదిరోజులపాటు తాను మానసికంగా నరకయాతన అనుభవించినట్టు చెప్పారు. అసోంలో ఎంతోమంది 'అక్రమ వలసదారు' ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారనీ, వారంతా ఈ దేశపౌరులేననీ ఆయన అన్నారు.
అధికారిక పత్రాలు సరిగా లేకపోవటం చిన్న సాంకేతిక కారణమనీ, దీనిని అడ్డుపెట్టుకొని పెద్ద సంఖ్యలో పౌరులను డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారనీ ఆయన ఆరోపించారు. అసోంలో జాతీయ పౌర జాబితాలో సనా ఉల్లా పేరు లేకపోవటంతో, 'విదేశీయుల ట్రిబ్యునల్' 'అక్రమ వలసదారు'గా గతనెల 28న ప్రకటించటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వెంటనే అరెస్టు చేసి జైలులాంటి డిటెన్షన్ సెంటర్కు అతడ్ని తరలించారు. ఈనేపథ్యంలో అసోంలోని బీజేపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. గౌహతీ హైకోర్టు కలుగజేసుకొని అతడికి మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.
ఈనేపథ్యంలో సుబేదార్ మహమ్మద్ సనా ఉల్లా తాజాగా ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. డిటెన్షన్ సెంటర్లో నెలకొన్న పరిస్థితులు తెలిపారు. 40-45 మందిని ఒక గదిలో బంధించి, ఒకే ఒక బాత్రూమ్ను కేటాయించారని అన్నారు. సాయంత్రం నాలుగుదాటితే గదికి తాళమేశారనీ, కనీసం ఆహారం కూడా సరిగ్గా పెట్టలేదనీ ఆయన ఆరోపించారు. అయితే ఇది తనొక్కడి అనుభవమే కాదనీ, రాష్ట్రంలో 'అక్రమ వలసదారు' ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హత్యారోపణలు చేసినా బాధపడేవాడ్ని కాదు..
జాతీయ పౌర జాబితాలో నా పేరు లేకుండా చేయటంలో కుట్ర దాగి ఉంది. సైనికుడిగా దేశానికి సేవ చేశాను. క్లిష్టమైన పరిస్థితుల్లో బాధ్యతలు నెరవేర్చాను. అలాంటి నాపై 'అక్రమ వలసదారు' అనే ఆరోపణ చేశారు. పదిరోజుల పాటు డిటెన్షన్ సెంటర్లో వేధించారు. హత్య చేశాడన్న ఆరోపణలు నాపై చేసినా ఇంత బాధపడేవాణ్ని కాదేమో! కోర్టుల్లో న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్నా.